వేలూరు: తమిళ ఆడిమాస అమావాస్యను పురస్కరించుకుని తర్పణాలు వదిలేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వేలూరు పాలారు నది వద్దకు చేరారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. ప్రజలు తమ తాత, ముత్తాలకు తర్పణ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమిళ ఆడిమాస అమావాస్యను పురస్కరించుకొని కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాలారు నది సమీపంలోని ముత్తు మండపం వద్ద తర్పణ పూజలు చేశారు. మృతి చెందిన తల్లి, తండ్రులను తలుచుకుని తర్పణం, నీరు, బియ్యం, అరటి కాయ, భోజనం వంటి వాటిని ఉంచి పూజలు చేశారు. అధిక సంఖ్యలో శివాచార్యులు పాలారు నది వద్దకు చేరుకొని తర్పణం, తిథిని సమర్పించారు. ఈ సందర్భంగా పాలారు నది వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సందడి నెలకొంది. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే వేలూరు జిల్లాలోని వానియంబాడి, ఆర్కాడు, రాణిపేట, వాలాజ, ఆంబూరు వంటి ప్రాంతాల్లోని పాలారు నది వద్ద కుటుంబ సభ్యులు పెద్దలకు తర్పణ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా తిరువణ్ణామలై జిల్లాలోను శ్మశానవాటికలు, నదుల వద్ద తర్పణ పూజలు చేశారు.


