భోపాల్: మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అహంకార పూరిత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఒక రెవెన్యూ అధికారి (పట్వారీ) వృద్ధుడి వీపుపై కూర్చుని పిల్ల కాలువ దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.
సిద్ధి జిల్లాలోని మాతా గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే లాల్వా కేవత్ (65) అనే వృద్ధుడి ఇల్లు, పంట పొలాలను పరిశీలించేందుకు నీలేష్ నామ్దేవ్ అనే పట్వారీ అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడ కాలువను దాటే సమయంలో తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఆ పట్వారీ వికృత ఆలోచనకు తెరతీశాడు. తనను వీపుపై ఎక్కించుకుంటేనే ఇంటి సర్వే చేస్తానని ఆ వృద్ధుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.
దీంతో చేసేది లేక ఆ వృద్ధుడు ఆ అధికారిని తన వీపుపై ఎక్కించుకుని నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేర్చాడు. ఈ అమానుష ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ప్రభుత్వ అధికారై ఉండి ఒక వృద్ధుడి పట్ల ఇలా ప్రవర్తించడంపై స్థానికులు నెటిజన్లు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. సిద్ధి కలెక్టర్,సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, బాధ్యుడైన పట్వారీ నీలేష్ నామ్దేవ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలేకాని, ఇలా వృద్ధులతో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
यह सीधी जिले के पटवारी साहब ।
जूते गंदे नहीं हो जाएं इसलिए एक बुजुर्ग के पीठ पर चढ़कर पानी से भरा गड्ढा पार किया pic.twitter.com/R2zDg0u6Z4— SanjayGupta_Journalist (@sanjaygupta1304) September 9, 2026


