సీమాంతర ఉగ్రవాదానికి కొత్త రెడ్‌లైన్‌ | Pakistan wants to bleed India by thousand cuts and we drew new red lines to combat terror: Gen Chauhan | Sakshi
Sakshi News home page

సీమాంతర ఉగ్రవాదానికి కొత్త రెడ్‌లైన్‌

Jun 4 2025 5:08 AM | Updated on Jun 4 2025 5:08 AM

 Pakistan wants to bleed India by thousand cuts and we drew new red lines to combat terror: Gen Chauhan

యుద్ధంలో చిన్నచిన్న తప్పిదాలు ముఖ్యం కాదు 

అంతిమ ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలి 

సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టీకరణ  

పుణే: వెయ్యిసార్లు గాయపర్చడం ద్వారా భారత్‌ను రక్తసిక్తం చేయాలన్న విధానాన్ని పాకిస్తాన్‌ అమలు చేస్తోందని ఇండియా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్‌లైన్‌ గీశామని చెప్పారు. మంగళవారం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీలో ‘భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ రీతులు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యుద్ధంలో జరిగిన చిన్నచిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు.

తాత్కాలిక నష్టాల కారణంగా సైన్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామంటూ తాను చేసిన ప్రకటనను కొందరు తప్పుపట్టడాన్ని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఖండించారు. మనవైపు జరిగిన నష్టం గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు స్పందించానని చెప్పారు. ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడే స్పష్టంచేశానని ఉద్ఘాటించారు. శత్రువు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకమని వ్యాఖ్యానించారు. జరిగిన నష్టం గురించి, అంకెల గురించి మాట్లాడుకోవడం సరైంది కాదన్నారు.

యుద్ధంలో ఎలాంటి నష్టం జరిగినా సైన్యం నైతిక స్థైర్యం కాపాడుకోవాలన్నారు. యుద్ధం, హింస ఉన్నచోట రాజకీయ జోక్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లోనూ అదే జరిగిందని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి కంటే కొన్ని వారాల ముందు పాకిస్తాన్‌ సైన్యాధిపతి జనరల్‌ అసీం మునీర్‌ భారత్‌కు, హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కారని అనిల్‌ చౌహాన్‌ గుర్తు చేశారు. భారత్‌ పట్ల దశాబ్దాలుగా కొనసా గుతున్న పాకిస్తాన్‌ విద్వేషాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్తాన్‌కు తెలి యజెప్పామని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు, అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

పాక్‌పై నిర్ణయాత్మక విజయం 
48 గంటలపాటు నిర్విరామంగా దాడులు చేసి ఇండియాను ఓడించాలని ప్రణాళిక సిద్ధం చేసిన పాకిస్తాన్‌ కేవలం 8 గంటల్లోనే చేతులెత్తేసిందని అనిల్‌ చౌహాన్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్‌ కాళ్లబేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆపరేషన్‌ ఇంకా కొనసాగితే చావుదెబ్బ తప్పదన్న సంగతికి పాక్‌కు తెలిసిపోయిందని వెల్లడించారు. కాల్పుల విరమణ, చర్చల ప్రతిపాదన తొలుత పాకిస్తాన్‌ నుంచే వచ్చిందని స్పష్టంచేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్తాన్‌పై నిర్ణయాత్మక విజయం సాధించామని మరోసారి తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు ‘ఇన్నింగ్స్‌ డిఫీట్‌’ మిగిలిందని అన్నారు. ఈ ఆపరేషన్‌ ఇంకా ముగిసిపోలేదని, పాకిస్తాన్‌తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement