సిమ్లా కాదు బెంగళూరు | Opposition Meeting shifted from Shimla to Bengaluru | Sakshi
Sakshi News home page

సిమ్లా కాదు బెంగళూరు

Jun 30 2023 4:53 AM | Updated on Jun 30 2023 4:53 AM

Opposition Meeting shifted from Shimla to Bengaluru - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్‌ పవార్‌ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని పవార్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement