పులులకు గడ్డు ఏడాదే

Ntca Report Says 126 Tiger Deaths 2021 In India - Sakshi

2021లో అత్యధికంగా 126 పులుల మరణం

అధికంగా మధ్యప్రదేశ్‌లో 44

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. గత ఏడాదిలో 106 పులులు చనిపోయినట్లు లెక్కలు చెబుతుండగా, ఈ ఏడాది మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్‌టీసీఏ వెల్లడించింది.

2016లో 121 పులులు మృత్యువాత పడటమే ఇప్పటివరకు గరిష్టంగా ఉండగా, ఈ ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయని తెలిపింది. ఈ ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14 ఉన్నాయని పేర్కొన్న ఎన్‌టీసీఏ తెలంగాణలో 4 పులులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి మరణించినట్లు వెల్లడించింది. 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 877 పులులు మరణించగా, ఇందులో అధికంగా మధ్యప్రదేశ్‌లోనే 202 మరణాలు ఉన్నాయని తెలిపింది. 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 8 పులులు మరణించాయంది. చనిపోయిన పులుల్లో 55.78% టైగర్‌ రిజర్వ్‌లోనూ, మరో 31.62% రిజర్వ్‌ సరిహద్దులకు బయట చనిపోయాయని వెల్లడించింది. పులుల మరణాలకు సంబంధించి  88.91% కేసులు పరిష్కారమయ్యాయని నివేదిక తెలిపింది. 

     

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top