‘స్మార్ట్ సిటీ’ చీటింగ్‌: 70 వేలమంది నుంచి రూ. 2,700 కోట్లు సేకరించి.. | Nexa Evergreen Dholera Smart City Duped 70,000 People of Rs 2,700 Crore | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్ సిటీ’ చీటింగ్‌: 70 వేలమంది నుంచి రూ. 2,700 కోట్లు సేకరించి..

Jun 16 2025 10:07 AM | Updated on Jun 16 2025 10:24 AM

Nexa Evergreen Dholera Smart City Duped 70,000 People of Rs 2,700 Crore

జైపూర్‌: రాజస్థాన్‌లో ‘స్మార్ట్‌ సిటీ’ పేరిట భారీ మోసం చోటుచేసుకుంది. సుభాష్ బిజ్రానీ,  రణవీర్ బిజ్రానీ అనే సోదరులు వారి భాగస్వాములతో కలసి, సుమారు 70,000 మంది నుంచి రూ. 2,676 కోట్లను సేకరించి, మోసానికి పాల్పడ్డారు. సికార్ జిల్లాకు చెందిన వీరు ‘నెక్సా ఎవర్‌గ్రీన్’ అనే కంపెనీని స్థాపించారు. ‘ధోలేరా స్మార్ట్ సిటీ’లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, వేలమందిని మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తొలుత వీరు ‘ధోలేరా స్మార్ట్ సిటీ’ పేరుతో ప్రాజక్టు చిత్రాలను రూపొందించి, పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. ఈ పథకంలోని ప్రతీ స్థాయిలో మంచి ఆదాయం, కమిషన్లు, ఇతర బహుమతులను ఉంటాయని నమ్మబలికారు. వినియోగదారులు తమ పెట్టుబడుల విషయంలో కొన్ని స్థాయిలు దాటిన తరువాత వారికి ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు తదితర రివార్డులు అందిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రత్యేక ఐడీ ఇచ్చి, ఈ పథకంలో మరింతమందిని చేర్చుకోగలిగితే, అదనపు కమిషన్లు కూడా ఇస్తామని సుభాష్ బిజ్రానీ,  రణవీర్ బిజ్రానీలు హామీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్టు కోసం రణ్‌వీర్ బిజారాణి 2014లో ధోలేరాలో భూమిని కొనుగోలు చేశాడు. తరువాత అతని సోదరుడు సుభాష్ బిజ్రానీ ఈ పథకంలో రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ ‘నెక్సా ఎవర్‌గ్రీన్‌’ను స్థాపించి, దానిని 2021లో అహ్మదాబాద్‌లో రిజిస్టర్ చేయించారు. తమ కంపెనీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టు చేపట్టిందని అందరికీ చెప్పారు. దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నామని వివరించారు. ఈ నేపధ్యంలో 70 వేల మందికి పైగా జనం వీరి పెట్టుబడి పథకాలలో చేరగా, సుమారు రూ.2,676 కోట్లు ఈ సోదరుల ఖాతాలో జమ అయ్యాయి.

ఈ మొత్తంతో వారు రాజస్థాన్‌లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్ళు, అహ్మదాబాద్‌లో ఫ్లాట్‌లు, గోవాలో 25 రిసార్ట్‌లను కొనుగోలు చేశారు. వారు రూ.250 కోట్ల నగదు  ఖర్చు చేసి, మిగిలిన  మొత్తాన్ని 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఇంతలో వీరు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఈ ఇద్దరు సోదరులు తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసి పరారయ్యారు. దీనిపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ‘నెక్సా ఎవర్‌గ్రీన్’కు చెందిన మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జైపూర్, సికార్, జున్‌జును, అహ్మదాబాద్‌లోని 25 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. కాగా ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్  అనేది కేంద్రం, గుజరాత్‌ సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. దీనిని 2042 నాటికి  పూర్తిచేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement