
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.
ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్లోని మహిసాగర్కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్లోని నార్తాంప్టన్కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు.
‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్లో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ