టీవీ రాముడికి ‘పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ! | Modi Cabinet Expansion Will Arun Govil Enter to Control Damage | Sakshi
Sakshi News home page

టీవీ రాముడికి ‘పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ!

Jun 28 2026 9:14 AM | Updated on Jun 28 2026 9:14 AM

Modi Cabinet Expansion Will Arun Govil Enter to Control Damage

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి మార్పు ఇదే కావడం విశేషం. అయితే, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తరుణంలో, ‘రామాయణం’ సీరియల్ ఫేమ్, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?
ఉత్తరప్రదేశ్ రామాలయంలో విరాళాలు, నగలు చోరీకి గురైన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు (డ్యామేజ్ కంట్రోల్) అరుణ్ గోవిల్ స్వచ్ఛమైన ఇమేజ్, ‘శ్రీరాముడి’గా ఆయనకున్న ప్రజాదరణను వాడుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయనను ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా రంగంలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.

రేసులో మరికొందరు ప్రముఖులు
ఈ మంత్రివర్గ విస్తరణలో అరుణ్ గోవిల్‌తో పాటు మాజీ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, శివసేన (యుబిటి) ఎంపీలను ఎన్డీయే వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా శ్రీకాంత్ షిండేకు, అలాగే బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్‌కు కూడా క్యాబినెట్‌లో చోటు దక్కవచ్చని సమాచారం. మరోవైపు అనురాగ్ ఠాకూర్ మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉండగా, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి సహా దాదాపు అర డజను మంది సహాయ మంత్రులకు స్థాన చలనం తప్పకపోవచ్చు.

రామాలయ చోరీ కేసులో సంచలనాలు
రామమందిరంలో నగదు, నగలు దొంగిలించిన కేసులో పోలీసులు ఇప్పటికే  ఎనిమిది మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై బలమైన ఆధారాలు లభించాయని, ఇప్పటివరకు రూ. 79.84 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న టిన్నూ అనే వ్యక్తి క్యాష్ కౌంటర్, నోట్ల లెక్కింపు హాల్ తాళాలు తన వద్దే ఉంచుకుని అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. నిందితులు సిఫార్సులపై విధుల్లో చేరడం, విధి నిర్వహణ తర్వాత వారిని తనిఖీ చేయకపోవడం వంటి తీవ్ర లోపాలు ఈ దర్యాప్తులో వెలుగుచూశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement