తూత్తుకుడి బాధితులకు ఉద్యోగాలిస్తాం | Sakshi
Sakshi News home page

తూత్తుకుడి బాధితులకు ఉద్యోగాలిస్తాం

Published Tue, Mar 23 2021 7:12 AM

MK Stalin Says Give Employment To Thoothukudi Victims In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని తుపాకీతో కాల్చి చంపిన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్‌ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రోడ్‌ షో, సభలతో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. తూత్తుకుడిలో సాగిన తుపాకీ కాల్పులు, సాత్తాన్‌ కులం పోలీసుల నిర్వాకం, జుడీషియల్‌ కస్టడిలో తండ్రికుమారుల మరణం తదితర విషయాలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు.

స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీగా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చిచంపిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఈ రాష్ట్రం ఏటు పోతున్నదో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. ప్రజలపై తుటాల్ని ఎక్కుబెట్టి 13 మంది మరణానికి కారణమైన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కరోనా కారణంగా జీవనం కోల్పోయిన వారికి రూ. 4 వేల  సాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే కరుణానిధి జయంతి రోజున ఈ పంపిణికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
చదవండి: అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్‌   

Advertisement
Advertisement