-
‘హెచ్-1బీ వీసా’.. ఆన్లైన్ ఫైలింగ్పై కీలక అప్డేట్!
అగ్రరాజ్యం అమెరికా వీసాల పునరుద్దరణ, జారీ వంటి అంశాలపై వరుస ప్రకటనలు చేస్తోంది. కొద్ది రోజుల స్వల్ప వ్యవధిలో భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. ఆ తర్వాత హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తాజాగా, ఈ ఏడాది 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అవేంటనేది ఒక్కసారి పరిశీలిస్తే ♦2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్ -1 బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి. ♦ప్రతి ఏటా కేవలం 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది. ♦ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్సీఐఎస్ విభాగం హెచ్-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ♦అక్టోబర్ నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ♦ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ ధరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని యూఎస్సీఐఎస్ అధికారులు సూచిస్తున్నారు. ♦ఈ ఏడాది ప్రత్యేకం హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అందులో మోసాలకు చెక్పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా అప్లికేషన్ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు. ♦ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. ♦ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. చదవండి👉 ‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన! -
‘మీలో స్కిల్స్ ఉన్నాయా’.. కొత్త ఏడాది దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు!
చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తూ మరో సంస్థలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీకో శుభవార్త!. మార్కెట్లో పెరిగిపోతున్న డిమాండ్కు అనుగుణంగా భారత్కు చెందిన టెక్నాలజీ,మార్కెటింగ్తో పాటు ఇతర విభాగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, రిక్రూట్మెంట్ కంపెనీ ‘మ్యాన్పవర్ గ్రూప్’ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వేని విడుదల చేసింది. ఆ సర్వేలో సుమారు 3,100కి పైగా రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 37శాతం నియామకాలు జనవరి - మార్చి 2024 సమయానికి ఆయా కంపెనీలు ఎంత మంది ఉద్యోగుల్ని తొలగించనున్నాయి. ఎంతమందిని నియమించుకోనున్నాయనే విషయంపై ఆరా తీసింది. ఈ సర్వేలో 37 శాతం మేర కంపెనీలో ఉద్యోగుల్ని హైయర్ చేసుకోనున్నాయి. గత ఏడాది పోలిస్తే నియమాకం 5 శాతం ఎక్కువగా ఉంది. సర్వే ప్రకారం... 37 శాతంతో భారత్, నెదర్లాండ్లు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో 35 శాతంతో కోస్టారికా- అమెరికా, 34 శాతంతో మెక్సికో 3వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా సగటున 26 శాతం మంది మాత్రమే ఉపాధి పొందనున్నారు. ఈ రంగాల్లో నియామకాల జోరు ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నియామకాల జోరు కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ విభాగాలున్నాయి. ఐటీ కంపెనీలు 44 శాతం, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో 45 శాతం హైయర్ చేసుకోనుండగా కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ రంగంలో 42 శాతం, ఎనర్జీ, యుటిలిటీస్లో 28 శాతం జరగనున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. టాలెంట్ గుర్తించ లేక జపాన్లో 85 శాతం కంపెనీలు ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవసరమయ్యే నిపుణుల్ని గుర్తించడంలో విఫలమైనట్లు మ్యాన్పవర్ గ్రూప్ సర్వే హైలెట్ చేసింది. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్ 82 శాతం, భారత్ 81 శాతంతో కొనసాగుతున్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగాలకు భారీ డిమాండ్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్, ఆటోమొటీవ్ విభాగాలు ఉండగా.. వాటి తర్వాతి స్థానంలో ఐటీ విభాగం ఉంది. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించి వారిని ఆకట్టుకునేలా జీతాలు పెంచుతూ వారితో పనిచేయించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటి అండ్ డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్,హెచ్ఆర్లలో ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ రంగాల్లో స్కిల్ ఉంటే జాబ్ త్వరగా సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అదిగో యువభారత్
‘దేనికీ వెరువని ధైర్యసాహసాలు, ముక్కుసూటితనంతో దూసుకుపోయే యువతే ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు!’ – స్వామి వివేకానంద యూఎన్ఎఫ్పీఏ.. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం (ఆ నివేదిక విడుదలయిన నాటికి) మన దేశ జనాభా.. 142.86 కోట్లు. 142.57 కోట్ల జనాభాతో ఉన్న చైనాను దాటేసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా పాపులేషన్ లిస్ట్లో ముందున్నాం. ప్రపంచమంతటా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉంటే.. అది ఒక్క మన దగ్గరే 68 శాతం ఉంది. ఈ జనాభాను ప్రపంచం.. వర్కింగ్ పాపులేషన్ అంటోంది. అంటే శక్తియుక్తులున్న మానవ వనరుల సమూహం.. మనకు అనుకూలమైన అంశం. ప్రపంచంలోకెల్లా అధిక జనాభా గల దేశంగానే కాదు.. అత్యధిక యువత ఉన్న దేశంగానూ ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే స్వామి వివేకానంద కోరుకున్న లక్షణాలతో ఉన్న యువతరం అన్నమాట. అడ్డూ అదుపూ లేని జనాభాతో వనరులను హరిస్తూ.. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని అభివృద్ధి చెందిన దేశాలు ఆగ్రహపడినా.. వెంటనే అసూయపడేలా చేస్తోంది ఈ యువతే. ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్గానే కాదు.. ప్రపంచ ఉత్పాదక రంగానికి అవసరమైన అద్భుత మానవ వనరులకూ మన నేలను కేంద్రంగా మలుస్తోంది. ఈ మనుషుల ఎడారిలో కనిపిస్తున్న ఆ ఒయాసిస్సే ఈ దేశం శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాన్నీ కల్పిస్తోంది. జపాన్తోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనాభా.. అందులో యువత తక్కువగా ఉండడంతో తీవ్రమైన వర్క్ఫోర్స్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఆయా దేశాల ఉత్పాదక రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఆ క్రమంలోనే 68 శాతం వర్కింగ్ పాపులేషన్తో మనం చాలా రిచ్గా ఉన్నాం.. అనే భావనలోనే కాదు.. ఆ దిశగా కృషిచేస్తే ప్రాక్టికల్గానూ ధనికదేశంగా మారగలం. ప్రపంచ మార్కెట్ని శాసించగలం. ఈ విషయంలో చైనానూ అధిగమించగలం. సవాళ్లు దేశ ఆర్థికాభివృద్ధికి యువతను ప్రధానవనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కానీ కార్యాచరణలో అదంత ఈజీ కాదు. ఆ లక్ష్యం చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలూ లేవు. ఏ జనాభాలోంచి వర్కింగ్ పాపులేషన్ను చూసి మురిసిపోతున్నామో.. ఆ వర్కింగ్ పాపులేషన్లోనే ఏ ఉపాధిమార్గంలేని వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం.. 2022 నాటికి మన దగ్గరున్న నిరుద్యోగిత 23.22 శాతం. 2018లో ఇది 4.9 శాతమే. ఈ పెరుగుదలకు కరోనా పరిస్థితులూ ఒక కారణం. పాండమిక్లో కోటీ తొంభైలక్షల యువత ఉద్యోగాలను కోల్పోయిందని కొన్ని సర్వేల సారాంశం. పని ఉన్నవారు కూడా చదువుకు సరిపడా కొలువులు దొరకక దొరికిన కొలువుల్లో తక్కువ వేతనాలతో సర్దుకోవాల్సిన పరిస్థితి. ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్ఐఈ) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే (2022) ప్రకారం ..ఈ నిరుద్యోగ పర్వంలో హరియాణ 37. 4 శాతం, రాజస్థాన్ 28.5 శాతం, ఢిల్లీ 20.8 శాతం పెరుగుదలతో మొదటి మూడు స్థానాల్లో తలవంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో 7.7 శాతం, తెలంగాణలో 4.1 శాతం పెరిగింది. ఉపాధి కల్పన లేమి.. పట్టణాలు, నగరాల్లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాల్లో మళ్లీ అధిక జనాభాదే మొదటి స్థానం. మిగతా కారణాల్లో.. అక్షరాస్యత.. ఉపాధి కల్పనల మధ్య అసమాన నిష్పత్తి, వ్యవసాయాధారిత పరిశ్రమలు తగినంతగా లేకపోవడం.. వ్యవసాయం నుంచి వలసలు (ఈ రెండిటినీ పరిగణించాలి), కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినడం, ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట్ల.. ఆ కుటుంబంలో ఒకరే వారసత్వ వ్యాపారాన్ని నిర్వహిస్తూండడం.. మిగిలిన వాళ్లకు పనిలేకపోవడం, కుటుంబ బాంధవ్యాలకు లోబడి కార్మికులు, శ్రామికులు స్వస్థలం వదిలి వెళ్లలేకపోవడం వంటివాటితోపాటు మార్కెట్ డిమాండ్కి అనుగుణమైన నైపుణ్య శిక్షణ లేకపోవడమూ కనిపిస్తున్నాయి. నైన్ టు ఫైవ్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యువత ప్రధాన వనరుగా ఉపయోగపడకపోవడానికి ఆ తరం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన అడ్డంకులను చూపిస్తున్నారు నిపుణులు. మొదటిది.. కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు కావల్సిన సాఫ్ట్ స్కిల్స్ వారిలో లేకపోవడం. రెండవది.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కావల్సిన మెళవకువలూ కరువవడం. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండూ ఉన్న యువతకూ తగినంత ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా కుటుంబపరమైన మద్దతు లభించడం లేదు. సొంతంగా వ్యాపారం చేద్దామనే యువత ఆశయం, ఉత్సాహం మీద సొంత కుటుంబాలే నీళ్లు చల్లుతున్నాయి.. కెరీర్తో తమ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడకుండా నెలనెలా వేతనంతో భద్రమైన జీవితాన్ని గడపాలనే కోరికతో! ప్రయోగాలకు పోయి పిల్లలు నష్టాలను తెస్తే నెత్తికెత్తుకునే ఆర్థిక సామర్థ్యం.. వాళ్లకు అండగా నిలబడే నైతిక స్థయిర్యం లేకపోవడమే ఆ వెనుకడుగుకు కారణం కావచ్చు. అందుకే పిల్లల ఉత్సాహం కన్నా భరోసానిచ్చే ఆర్థిక భవిష్యత్ పట్లే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ జీతపు ఉద్యోగాల దిశగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే నైన్ టు ఫైవ్ జాబులే సర్వస్వం కాదనే సత్యాన్ని గ్రహించాలి. అలాగని ఇలా వ్యాపారం పెట్టగానే అలా కోట్లలో లాభాలు వచ్చిపడతాయి.. అవి తిరిగి పెట్టుబడులుగా మారి.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే నమ్మకాన్ని ఎవరూ ఇవ్వలేరు. కానీ ప్రయత్నం జరగాలి. ఈ రోజు యువత ఆ ధైర్యం చేయలేకపోతే రేపటి యువతకు ఎక్కడి నుంచి ప్రేరణ అందుతుంది? నేడు విజయపథంలో ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటియం, ఓలా వగైరా సంస్థలు నిన్న ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టినవే. ఒడిదుడుకులు తెలిసి.. తట్టుకునే మెకానిజమూ అర్థమై నేడు మార్కెట్లో తమ సేవలకు డిమాండ్ కల్పించుకుంటున్నవే! అందుకే దిగితేకానీ లోతు అంతుబట్టదు. ఐడియాలను కార్యాచరణలో పెడితే కానీ సక్సెస్ చేతికి చిక్కదు. గ్లోబలైజేషన్ తర్వాత రోజ్గార్ బజార్ రూపురేఖలు మారిపోయాయి. సర్కారు కొలువుల పరిధి తగ్గుతూ వస్తోందా.. ప్రైవేట్ జాబ్స్ విస్తృతమవుతున్నాయా అనేది తెలియదు కానీ పెను మార్పయితే స్పష్టమయింది. తదనుగుణంగానే యువత అడుగులూ అనివార్యం అయ్యాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా తప్పనిసరి అయిందో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార దక్షత కూడా అంతే తప్పనిసరి అవుతోంది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అందరూ నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కోసమే దరఖాస్తు చేసుకుంటే వాటిని సృష్టించే సంస్థలు ఉండొద్దూ? ఆ సంస్థలను నడిపే వ్యాపారవేత్తలు.. పారిశ్రామిక గణం రావద్దూ? ఆ చొరవ తీసుకోవడానికి.. చూపడానికి కావల్సిన శక్తియుక్తులున్న యువత మన దగ్గరే ఉంది. వారికి కావల్సింది ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక ఆలంబన.. కుటుంబం నుంచి కాసింత నమ్మకం! ఆ రెండూ ఇస్తే ఐడియాలతో స్టార్టప్లను పండిస్తూ వాప్యార దక్షతను పెంపొందించుకుంటుంది. బడా పారిశామికవేత్తల పెట్టుబడులను రాబట్టుకుంటుంది. వేలసంఖ్యలో కొత్త కొలువులను సృష్టిస్తుంది. ఆశాకిరణాలు.. నికరంగా వేతనాలు అందే ఉద్యోగాలే చేయాలనే తల్లిదండ్రుల ఒత్తిడినీ, పెట్టుబడుల కొరతనూ లెక్కచేయక ముందడుగు వేస్తున్న యువతా ఉన్నారు. కాబట్టే మన దగ్గర స్టార్టప్ కల్చర్ దినదిన ప్రవర్థమానమవుతోంది. ఎంతోమంది యంగ్ అంట్రప్రెన్యూర్స్ని సృష్టిస్తోంది. ఇందుకు ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ చక్కటి ఉదాహరణ. 2013లో.. అంటే తన పందొమ్మిదో ఏట .. ‘ఓయో రూమ్స్’ ప్రారంభించాడు. సరసమైన ధరలో.. సౌకర్యవంతమైన ఒక బసను వెదకడంలో విఫలమైన ఫ్రస్ట్రేషన్తో అతను ఈ కంపెనీని స్థాపించాడు. ఈ రోజు ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా పేరుపొందాడు. ఫోర్బ్స్ – 30 అండర్ 30 లిస్ట్ ఫర్ ఆసియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ వరుసలోనే లాజిస్టిక్ స్టార్టప్ ‘పోర్టర్’ ఫౌండర్ ప్రణవ్ గోయెల్నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్టప్ 500 సభ్యుల టీమ్గా..సిఖోయా కాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్స్తో వంద మిలియన్ డాలర్ల ఫండింగ్తో విరాజిల్లుతోంది. లెన్స్కార్ట్ గురించి తెలుసు కదా! దాని ఫౌండర్ పియూష్ భన్సాల్ కూడా యంగ్చాప్.. 2010లో ఆ పోర్టల్ను స్థాపించినప్పుడు! ఫోర్బ్స్ – 30 అండర్ 30లో ఉన్నాడు. అందరూ అబ్బాయిలేనా.. మరి అమ్మాయిలూ? అనే క్వశ్చన్ మార్క్ ఇమోజీని డిలీట్ చేయండి. అంట్రప్రెన్యూర్స్గా అమ్మాయిల సంఖ్యా తక్కువేం లేదు మన దగ్గర. దేశంలోని 58 శాతం మహిళా అంట్రప్రెన్యూర్స్ .. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించారు. వీళ్లంతా తమ తాతల, తండ్రుల వ్యాపారాన్ని నడుపుతున్నవారు కాదు. ఇండిపెండెంట్ అంట్రప్రెన్యూర్స్. వాళ్లలో ‘మెన్స్ట్రుపీడియా’ ఫౌండర్ అదితి గుప్తా.. మోస్ట్ సక్సెస్ఫుల్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలక్ష్మి సురేశ్.. దేశంలోకెల్లా అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా అంట్రప్రెన్యూర్. 2020లో తన ఇరవయ్యొకటో ఏటకల్లా.. ప్రపంచంలోనే యంగెస్ట్ వెబ్ డిజైనర్ కమ్ సీఈఓగా పేరు పొందింది. తన ఎనిమిదవ ఏటనే కోళికోడ్లోని తన స్కూల్కి వెబ్సైట్ని క్రియేట్ చేసింది. శ్రీలక్ష్మి ‘ఎస్ఈఓ’ అనే వెబ్ డిజైన్ కంపెనీని ప్రారంభించేనాటికి ఆమెకు పదేళ్లు. ఒక్క తన స్కూల్కే కాదు దేశంలోని ఇతరత్రా వాటికోసం ఆమె ఓ వంద వెబ్సైట్స్ని డెవలప్ చేసింది. వీళ్లంతా దేశంలో స్టార్టప్ కల్చర్ వృద్ధికి ఆశాకిరణాలు! మేధో వలస.. దేశానికి యువత.. బలంగా మారకుండా అడ్డంపడుతున్న మరో సవాలు మేధో వలస. తమ ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, జీతభత్యాలు, వాళ్లు కోరుకున్న జీవన ప్రమాణాలు లేక ఎంతోమంది యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. పైగా మన దగ్గర ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. ఈ వలస తాత్కాలిక పరిణామంలాగే కనిపిస్తుంది కానీ మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల నష్టాన్ని చేకూరుస్తోంది. ఈ మేధో వలసల్లో ముఖ్యంగా ఐఐటీయన్లే ఉంటున్నారు. మన ఐఐటీల్లో శిక్షణ పొందిన విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఐఐటీ పట్టభద్రుల పట్ల విదేశీ సంస్థలకు విపరీతమైన క్రేజ్! దాంతో వీళ్లకు ఊహించని రీతిలో వేతనాలిస్తూ తమ సంస్థల్లో ప్లేస్మెంట్స్ని కల్పిస్తున్నాయి. వాళ్లు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అందించడానికీ పోటీ పడుతున్నాయి. అందుకే బ్రెయిన్ డ్రెయిన్కి బ్రేక్ పడడం లేదు. ఈ వలసలన్నీ ప్రధానంగా అమెరికాకే తరలుతున్నాయి. విదేశాలకు వెళుతున్న ఐఐటియన్లలో 65 శాతం మందికి అమెరికాయే మజిలీ. ప్రపంచంలోని 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ జారీ చేసే హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాల లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్నది మన ఐఐటీ విద్యార్థులే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్కి విదేశాల్లో 540 శాతం ప్లేస్మెంట్స్ పెరిగాయంటే మన ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి దాదాపు లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అంచనా. 2014 నుంచి దాదాపు 2300 మంది సంపన్నులు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలే! త్వరిత గతిన మన దేశాన్ని అభివృద్ధి పరచగల ప్రతిభాసామర్థ్యాలే! అందుకే వేగిరంగా ఈ మేధో వలసను ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అమ్మాయిల భాగస్వామ్యం.. ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) సర్వే ప్రకారం.. పదిహేను నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో దాదాపు యాభై శాతం మంది అమ్మాయిలు ఇటు చదువుకోవడమూ లేదు అటు ఉద్యోగాల్లోనూ లేరు. కారణం.. కుటుంబ బాధ్యతలు, పెళ్లి! ఆశ్చర్యపోకండి! ఈ దేశంలో చాలా విషయాల్లో వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నట్లే స్త్రీ సమానత్వం విషయంలోనూ భిన్నమైన వాతావరణం ఉంది. స్త్రీవాద ఉద్యమాలతో చైతన్యం పొందిన ప్రాంతాల్లోనే ఇంకా అసమానతలు కన్పిస్తుంటే అసలు ఆ ఊసే లేని ప్రాంతాల్లో అమ్మాయిల స్థితి ఎలా ఉండొచ్చు! దీనికి సమాధానమే ఆ సర్వే. దాన్నిబట్టే అర్థమవుతోంది వర్క్ఫోర్స్లో అమ్మాయిల భాగస్వామ్యం ఎంతో! ఆడపిల్ల ఉద్యోగం చేయాలా? వద్దా? ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఆ మాటకొస్తే చదువు దగ్గర నుంచే ఆ నిర్ణయం మొదలవుతోంది. అయితే అమ్మాయిది కాదు.. కుటుంబానిది. విద్యావంతుల కుటుంబంలోని అమ్మాయిలకు తమకు ఇష్టమైన చదువు చదివే స్వేచ్ఛ దొరికినా.. కెరీర్ విషయానికి వచ్చేసరికి పెళ్లి అనేది దాన్ని సాగనివ్వడంలేదు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇది పెళ్లికాని అమ్మాయికి కూడా అడ్డంకిగానే ఉంది. ‘ఇంకా ఇలాంటి పరిస్థితులున్నాయా విడ్డూరం కాకపోతే అని ముక్కున వేలేసుకునే పనిలేదు. ఇప్పటికీ మనదేశంలో.. అమ్మాయిలకు చదువు, ఉద్యోగం కన్నా పెళ్లే ఆర్థిక భద్రతను, భరోసాను ఇస్తుంది అని భావించే కుటుంబాలే ఎక్కువ’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి. ఇలా పెళ్లి, పిల్లలు అనే బాధ్యత వర్క్ఫోర్స్లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని తగ్గిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ విషయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యత్యాసం తగ్గాలి. అవగాహనా కార్యక్రమాలు పెరగాలి. ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సహాయాలు.. దేశంలో ఇప్పుడు అంట్రప్రెన్యూర్ రంగంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణించేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్మెంట్ అండ్ అంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ. ఆ శిక్షణతో యువత అంట్రప్రెన్యూర్స్గా ఎదిగి.. ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది. స్కిల్ ఇండియా మిషన్.. పాతికేళ్లలోపు యువతకు వృత్తి శిక్షణ, పాలిటెక్నిక్, ఐటీ, సాఫ్ట్స్కిల్స్ డెవలప్మెంట్ వంటి కోర్సులను బోధిస్తోంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వగైరాల ద్వారా స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్ను చేపడుతోంది. అంట్రప్రెన్యూర్షిప్ దిశగా యువతను ప్రోత్సహించడానికి పెట్టుబడుల కోసం ఆర్థిక మద్దతునూ అందిస్తోంది. పన్ను రాయితీలు కల్పిస్తోంది. కొత్త ఇంక్యుబేటర్స్ను క్రియేట్ చేస్తోంది. ఉన్న ఇంక్యుబేటర్ల సామర్థ్యాన్ని పెంచుతోంది. దేశంలోని పట్టణ, నగరాల్లోని యువత కన్నా గ్రామీణ యువతే అంట్రప్రెన్యూర్షిప్ పట్ల ఉత్సుకతతో ఉన్నారు. అందుకే ప్రధాన్మంత్రి కుశల్ కేంద్రాలు అంట్రప్రెన్యూర్షిప్ హబ్స్గా మారి ఆసక్తి ఉన్న ట్రైనీలను అంట్రప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఐడీబీఐ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఎస్ఈటీఐఎస్) వంటి స్థానిక సంస్థలతో కలసి చదువుకున్న యువతకు స్టార్టప్స్లో శిక్షణనిస్తోంది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ అంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్నీ స్థాపించింది. కాలేజ్స్టూడెంట్స్లోని అంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ని వెలికి తీసి వారికి శిక్షణనిస్తోంది. నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేస్తోంది. సృజనాత్మక రంగాల్లో.. ఉన్నత విద్య మీద నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్లో ఇంజినీరింగ్ (బీటెక్ అండ్ ఎమ్టెక్)లో కోవిడ్ కంటే ముందు అయిదేళ్లలో దాదాపు 6,37,781 అడ్మిషన్లు పడిపోయాయని తేలింది. అదే సమయంలో సృజనాత్మక రంగాలైన ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, డిజైనింగ్, లింగ్విస్టిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంత్సరంలో 53, 213 మంది విద్యార్థులు పలురకాల ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు పొందారు. ఈ వృద్ధి ఆయా రంగాల్లో కొత్త కొలువులు ఏర్పడేందుకు దోహదపడుతోందనేది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల అభిప్రాయం. ‘భారతీయ సినిమా మీద సోషల్ మీడియా, డిజిటలైజేషన్ ప్రభావాన్ని కాదనలేం. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద సినిమా ప్రదర్శన గురించి ఏనాడైనా ఊహించామా? ఈ మార్పు ఆయా రంగాల్లో ఎన్నో కొత్తరకాల∙ఉద్యోగాలకు దారితీస్తోంది. వాటిల్లో వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటివి మచ్చుకు కొన్ని. నేటి యువత ఇదివరకటిలా కెరీర్కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పట్టుకు వేళ్లాడట్లేదు. సాంకేతిక విప్లవ ప్రపంచంలో ఎలాగైనా బతకగలమనే ధైర్యం వాళ్లకుంది. ఏ ఉద్యోగమైనా తిండి పెడుతుంది అనే భరోసా కలిగింది. అందుకే నచ్చిన ఉద్యోగాలను ఇచ్చే చదువులను ఎంచుకుంటున్నారు. కొందరైతే చదివిన చదువుతో సంబంధం లేకుండా కొత్త కొత్త కొలువులతో ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాన్నానల అంచనాలను సంతృప్తి పరచడమా లేక తమకు నచ్చినట్టు ఉండడమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనే వాళ్లు తీసుకుంటున్నారు. అలాగని పిల్లల ఇష్టాల్ని సపోర్ట్ చేయని తల్లిదండ్రులే అందరూ అని చెప్పడానికీ లేదు. చాలా మంది పెద్దలు కూడా పిల్లల సృజనాత్మకత మీద నమ్మకంతో వాళ్లకు నచ్చిన దారిలో వాళ్లు వెళ్లే స్వతంత్రాన్నిస్తున్నారు. అండగా నిలబెడుతున్నారు. దాంతో సృజనాత్మక రంగాలైన డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటివాటిల్లో నేటి యువత రాణిస్తోంది. ఆ రంగాలకూ డిమాండ్ పెరిగి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కాబట్టి సృజనాత్మక రంగాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గానే చూడకుండా.. మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగానూ గుర్తించి.. ఆ దిశగా వాటిని సిలబస్లో చేర్చాలి’ అంటారు న్యూ ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని కల్చర్ డిపార్ట్మెంట్ అధిపతి మిర్ ఇంతియాజ్. ‘విదేశాల్లో లాగా బయటి క్రియేటివ్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేలా ఓ పాలసీని తయారు చేయాలి. అప్పుడే యువతకు ఫలానా కోర్స్ చదివితే ఫలానా రంగంలో ఫలానా ఉద్యోగాలు ఉన్నాయనే అవగాహన కలుగుతుంది. ఇప్పుడెలాగైతే కంప్యూటర్ సైన్స్ చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలున్నాయని తెలుస్తోందో అలాగా’ అని అభిప్రాయపడుతున్నారు పుణెలోని ఎమ్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లోని ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ డిపార్ట్మెంట్ హెడ్ ఇంద్రజిత్ నియోగి. ‘సీబీఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ పాటర్న్లో ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం క్రియేటివ్ కోర్సుల్లో అంట్రప్రెన్యూర్ షిప్ కరిక్యులమ్ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారి.. పిల్లల్లోని సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంటుంది’ అని చెబుతున్నారు విద్యారంగ నిపుణులు. ముగింపు దేశంలో ప్రతి ఏటా దాదాపు కోటి మంది యువత వర్క్ఫోర్స్లోకి వస్తోందని అంచనా. ఇప్పుడున్న అవకాశాలు సరిపోవడం లేదు. అదీగాక మన దగ్గరున్న యువతరం దాదాపుగా.. ఉపాధి కల్పన అంతగాలేని గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందినదే. చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది అమ్మాయిలు సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మారాలని ఆశిస్తున్నారు. వారిలో నేర్చుకునే తపనకు.. సృజనాత్మక ఆలోచనలకేం కొదువలేదు. కావల్సిందల్లా సరైన మార్గదర్శకత్వం.. అవసరమైన మౌలిక సదుపాయాలు. ఇందాకే చెప్పుకున్నట్టు వీళ్లంతా మన దేశ ఆర్థిక ప్రగతికి అవాకాశాలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు యువ జనాభా లేక ఉస్సూరుమంటున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి. అలాంటి దేశాలకు మన యూత్ వరం. మన దగ్గరి ప్రతిభావంతులైన యువతకు వాళ్ల దేశంలో మంచి కొలువులు ఇస్తానని ఇప్పటికే జపాన్ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను మనం ఇంకెన్నో దేశాలతో చేసుకునే వీలుంది. అయితే ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలి. మనకున్న మరో అనుకూలాంశం. పెరుగుతున్న మధ్యతరగతి. వీళ్లే అతిపెద్ద వినియోగదారులు. మన డొమెస్టిక్ గ్రోత్కి డ్రైవర్స్. అందుకే పెట్టుబడులకూ మన దేశాన్ని మించింది లేదు. ఆ పెట్టుబడులే ఉద్యోగాలనూ సృష్టిస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతకు ఉపాధి కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఇదే ప్రభుత్వాల ఎజెండా కావాలి. అప్పుడే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం! -
కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్లీజ్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్ సెక్టార్)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్లీజ్ సంస్థ తమ ‘ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్’ను తాజాగా విడుదల చేసింది. దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్లీజ్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది. సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్ (94 శాతం), ఎడ్యుకేషనల్ (93 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (88 శాతం), రిటైల్ (85 శాతం), లాజిస్టిక్స్ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్ సెక్టార్లో భారత్ ‘గ్లోబల్ లీడర్’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ టాడే పేర్కొన్నారు. ‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్ స్కిల్లింగ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ థామస్ పేర్కొన్నారు. -
CM YS Jagan: ఉద్యోగాల కల్పన ఓ రికార్డు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో అరుదైన రికార్డు నమోదు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్.. ఆయా సచివాలయాల్లో ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. అదో రికార్డు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. 2019లో జూలై – అక్టోబర్ మధ్య జరిగిన ఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం గానీ, ఇంత భారీగా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, పరీక్షలు నిర్వహించడం జరగలేదని అధికార వర్గాలు వివరించాయి. ఇంత మంది అభ్యర్థులకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎటువంటి తప్పులకు తావులేకుండా అప్పట్లో ప్రభుత్వం సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడం కూడా ఓ రికార్డే. రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే నియామకాలు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కేవలం అభ్యర్థులు రాత పరీక్షల్లో తెచ్చుకున్న మెరిట్ మార్కుల ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగింది. అవినీతికి ఆస్కారం ఉండకూడదని ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల విధానానికి సైతం ప్రభుత్వం స్వస్తి పలికింది. సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 జూలైలో తొలి విడత నోటిíఫికేషన్ జారీ చేసి, సెప్టెంబర్లో రాత పరీక్షలు నిర్వహించింది. అందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కలెక్టర్ల పర్యవేక్షణలో నియామక ప్రక్రియ నిర్వహించింది. తొలి విడతలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు 2020 జనవరిలో ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా 2020 సెప్టెంబర్లో రాత పరీక్షలు నిర్వహించి, ఆ వెంటనే నియామక ప్రక్రియను చేపట్టి, 2021 జనవరి నాటికి పూర్తి చేసింది. సచివాలయాల్లో పని చేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను మరో 8 వేల దాకా కొత్తగా సృష్టించి, వాటిని విద్యుత్ సంస్థల ద్వారా వేరుగా భర్తీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728 2019లో తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి : 1,05,869 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినవి: 13,136 రెండు విడతల నోటిఫికేషన్ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529 తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్కు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement