బుధవారం రాత్రి చెన్నై చేరుకున్న అమిత్ షా
సాక్షి, చెన్నై: దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. కాగా దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే సదస్సు బుధవారం రాత్రి లాంఛనంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆయా రాష్ట్రాల అధికారులు సమావేశమైనట్లు సమాచారం. గురువారం ఉదయం దక్షిణాది రాష్ట్రాల సీఎంల కీలక సదస్సు జరగనుంది. కాగా మీడియాకు అనుమతి లేదని ప్రకటించడంతో పాటు సమావేశ వివరాలను పీఐబీ వర్గాలు బుధవారం రాత్రి విడుదల చేశాయి. ఇందులో కేంద్ర హోం అమిత్ షా అధ్యక్షతన జరిగే 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి ఉపాధ్యక్షుడిగా తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్ వ్యవహరించనున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో చర్చించబోయే కీలక అంశాలను ప్రకటించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోని పెండింగ్ అంశాలు, రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, అంతర్రాష్టప్రాజెక్టులు, మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచార కేసుల త్వరిత విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల ఏర్పాటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, విమానయాన రంగానికి చెందిన మౌలిక వసతులు, విద్యా సంబంధిత అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అమిత్ షా పర్యటించే మార్గాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు సదస్సు నిమిత్తం బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నారు.


