కోలారు: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇట్టే నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. వారి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇదే మాదిరిగా.. నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్లో పెడతానని ఓ సైబర్ నేరగాడు బెదిరిస్తుండగా, భయాందోళనకు గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ దారుణ ఘటన కోలారు తాలూకాలోని ఛత్రకోడిహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వివాహిత (28) మృతురాలు. తాలూకాలోని బెగ్లిబెణచేనహళ్లికి యువకుడు శ్రీకాంత్ ఆమెకు పరిచయస్తుడు. సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వేధించి ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేశాడు.
భయాందోళనకు గురై..
కొన్నిరోజులుగా మరింతగా బెదిరించి మాంగల్యం చైను, బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్పై మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా బెదిరించి దోచుకున్నట్లు ఆపణలు ఉన్నాయి. శ్రీకాంత్ వల్ల తన కాపురం బజారుపాలై పరువు పోతుందని ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం ఉదయం కోలారు రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు.


