
జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.
ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
