2 వారాల పాటు అక్క‌డ చికెన్‌, మ‌ట‌న్ బంద్‌ | Ban on sale of non veg food items in Maharashtra's Pandharpur | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 29 వరకు చికెన్‌, మ‌ట‌న్ బంద్‌

Jul 15 2026 2:20 PM | Updated on Jul 15 2026 2:26 PM

Ban on sale of non veg food items in Maharashtra's Pandharpur

పండరీపూర్‌లో మాంసం విక్రయాలపై నిషేధం

ఆదేశాలు జారీచేసిన కలెక్టర్‌

సాక్షి ముంబై: ఆషాఢీ వారీ సందర్భంగా విఠోబా దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు పండరీపూర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ నేటి నుంచి 29 వరకు మ‌హారాష్ట్ర‌లోని పండరీపూర్‌ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోలాపూర్‌ జిల్లా ఇంచార్జి మంత్రి జయకుమార్‌ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఆషాఢీ వారీ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్‌కు చేరుకుంటారని, ఈ పవిత్ర వేళలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆదేశాలను ఉల్లంఘించి మాంసం లేదా మటన్‌ అమ్మకాలు కొనసాగిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.

గజానన్‌ మహారాజ్‌ పల్లకీ యాత్రకు ముమ్మర ఏర్పాట్లు 
సోలాపూర్‌: శ్రీ క్షేత్ర షేగావ్‌ నుంచి పండరీపూర్‌ బయలుదేరిన శ్రీ గజానన్‌ మహారాజ్‌ పల్లకీ, వార్కారీల పాదయాత్ర ఈనెల 18న సోలాపూర్‌ చేరుకోనుంది. పల్లకీ, వార్కరీలు రెండు రోజులు ఇక్కడే బస చేయనున్న నేపథ్యంలో మేయర్‌ వినాయక కొండ్యాల్‌ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ రంజిత చాకోతే, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ సచిన్‌ ఓంబాసే, అదనపు కమిషనర్‌  వీణా పవార్, కార్పొరేటర్లు వందన గైక్వాడ్‌ , శ్రీదేవి పూలారే, కల్పన కదం , గౌతం కస్బే, దిలీప్‌ కొల్హె, సిటీ ఇంజనీర్‌ సారిక ఆకులువార్, అగ్నిమాపక విభాగం ప్రముఖ అధికారి రాకేష్‌  సాలుంకే, శ్రీ గజానన మహారాజ్‌ షేగావ్‌ సంస్థాన్‌కు  చెందిన స్థానిక ప్రతినిధులు సునీల్‌ కులకర్ణి, సునీల్‌ ఫాల్కే, ఉద్యానవన అధికారి కోమల్‌ కాశిది సంబంధిత విభాగాల అధికారులు ఉన్నారు.

రూప భవాని చౌక్, తుల్జాపూర్‌ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్‌ చౌక్‌ శ్రీ సద్గురు ప్రభాకర్‌ స్వామి మహారాజ్‌ మందిర్, బాలివేస్‌ టెలిఫోన్‌ భవన్, కుంబార్‌ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్‌ మార్గాలతో పాటు పద్మశాలీ శిక్షణ సంస్థకు చెందిన కుఛన్‌ పాఠశాలల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే  వార్కారీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపాన్ని, అక్కడి నుండి తరలి వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్‌ మార్గాల వద్ద సన్నాహాలను సమీక్షించారు.

చ‌ద‌వండి: ఆ రూట్‌లో వెళ్లే వాహ‌నాల‌కు టోల్ ఫీజు లేదు

వార్కరీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మేయర్‌ అధికారులను ఆదేశించారు. పల్లకి మార్గంలో అడ్డువచ్చే చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలని అలాగే రోడ్లపై గుంతలను పూడ్చాలని, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. కమిషనర్‌ డాక్టర్‌ సచిన్‌ ఓం బాసే పల్లకి మార్గాల వెంబడి అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే పారిశుధ్యం, నీటి సరఫరా, ఆరోగ్య, అగ్నిమాపక, అత్యవసర విభాగాల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement