ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్ భత్ఖాల్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.


