Maharashtra Political Crisis: పోలీస్‌ శాఖతో గవర్నర్‌ చర్చలు.. రాష్ట్రపతి పాలన రాబోతోందా?

Maharashtra Governor Recommends To President Rule Over Political Crisis - Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్‌ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్‌ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్‌నాథ్‌ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. మరో వైపు శివసేన కార్యకర్తలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వారి ఆఫీసులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్‌ చీఫ్‌.. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ఆదేశాలు పాటిస్తున్నారు. ఈ తరుణంలో బలనిరూపణకై రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టినా వారిపై శివసేన కార్యకర్తల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించే యోచనలో గవర్నర్‌ ఉన్నట్లు సమాచారం. 

గవర్నర్‌ కూడా ఓ వైపు ఎలాంటి అలజడులు లేకుండా పోలీస్‌ శాఖతో చర్చలు జరుపుతూనే మరోవైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు ముంబైలోని పరిస్థితులను వివరిస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్రంతో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఎంపీ  నవనీత్‌ కౌర్‌ రానా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరడం గమనార్షం. శివ సైనికుల గూండాయిజంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

మరో వైపు సీఎం ఉద్ధవ్‌ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యే సతీమణీల ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు.

చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్‌.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top