
తిరువనంతపురం: విద్యార్థినుల చేత గుంజిళ్లు తీయించినందుకు ప్రభుత్వం ఉపాధ్యాయురాలికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన కేరళలోని కాటన్హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థినులు తరగతి గదినుంచి బయటికి వెళ్లిపోయారు. అది చూసిన టీచర్ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
జాతీయగీతం పాడుతుండగా వెళ్లిపోయిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించారు. దీంతో ఆయా విద్యార్థినులు స్కూల్ బస్సును మిస్సయ్యారు. తమ పిల్లలు రోజూకంటే ఆలస్యంగా ఇంటికి రావడంతో వారిని ప్రశ్నించిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఎలాంటి వివరణ లేకుండానే విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి ఆదివారం ఉపాద్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక మేరకు.. నోటీసులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.