చండీగఢ్: పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మరికాసేపట్లో కదులుతుందనగా టాయిలెట్ వద్ద ఉండే క్యాబిన్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో రైలు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ రోజు (శనివారం) ఉదయం లూథియానా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా స్పెషల్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఒక స్లీపర్ కోచ్లోని టాయిలెట్ వద్ద నిర్మాణ లోపంతో బెర్తులు కుదుపులకు గురయ్యాయి. దీంతో స్లీపర్ కోచ్ దెబ్బతింది. టాయిలెట్ల సమీపంలో కోచ్ బాడీ పగిలిపోయింది. టాయిలెట్ పరికరాలు దెబ్బతిని పట్టాలపై కూలిపోయాయి.
రైలులో అకస్మాత్తుగా కుదుపు రావడం, కోచ్ ఒకవైపుకు వంగిపోవడాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే రైల్వే కోచ్ నుంచి దూకేశారు. అయితే వెనువెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, దెబ్బతిన్న కోచ్ నుండి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ రైలు వేగంగా ఉండి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవన్నారు.అయితే దెబ్బతిన్న బోగీ స్థానంలో వెంటనే మరో బోగీ ఏర్పాటు చేసి రైలును ప్రారంభించారు.


