జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ | Shocking Twist, Justice Yashwant Varma Approaches Supreme Court, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌

Jul 18 2025 8:37 AM | Updated on Jul 18 2025 10:21 AM

Justice Yashwant Varma approaches Supreme Court News Details

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నోట్ల కట్టల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సుప్రీం కోర్టులో ఆయన ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ కమిటీ సమర్పించిన నివేదికను, తనను అభిశంసించాలంటూ చేసిన ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ జస్టిస్‌ వర్మ ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది.

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్‌ వర్మ.. గతంలో ఢిల్లీ హైకోర్టులో పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పే క్రమంలో కాలిన నోట్ల కట్టలు బయటడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ముగ్గురు జడ్జిల విచారణ కమిటీ.. ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే విచారణ కమిటీ నివేదిక.. తన వ్యక్తిగత, జడ్జి పదవి దృష్ట్యా సక్రమించిన రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ విచారణ సవ్యంగా జరగలేదని అందులో పేర్కొన్నారాయన.   అంతేకాదు.. తనను అభిశంసించాలని గతంలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారాయన.

ఇదిలా ఉంటే.. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లోనే ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. మరోవైపు.. నోట్ల కట్టల వ్యవహౠరంపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లతో అర్థవంతమైన దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణను సైతం స్వీకరించడం తెలిసిందే.

అసలేంటి కేసు..
మార్చి 2025లో హోలీ పండుగన.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన ఫైర్‌, పోలీసు సిబ్బందికి ఓ గదిలో నోట్ల కట్టలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఆ సమయంలో ఆయన తన కుటుంబంతో ఊరెళ్లారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ దేశవ్యాప్త చర్చ నడిచింది. అయితే ఆ నోట్ల కట్టలతో తనకు సంబంధం లేదని.. ఇదంతా తనను బద్నాం చేసే ప్రయత్నమని జస్టిస్‌ శర్మ ఆ ఆరోపణలను ఖండించారు.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అప్పటి సీజేఐ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించగా.. ఆయన దానిని రాష్ట్రపతికి లేఖ రూపంలో పంపించారు. మరోవైపు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్‌ హైకోర్టుకు(స్వస్థలం కూడా) ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే అక్కడి బార్‌ అసోషియేషన్‌ ఈ బదిలీని తీవ్రంగా ‍వ్యతిరేకించడంతో.. ఆయనకు విధులు అప్పగించకుండా అలాగే ఉంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement