నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి | JP Nadda convoy pelted with stones during Diamond Harbour visit | Sakshi
Sakshi News home page

నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Dec 11 2020 2:28 AM | Updated on Dec 11 2020 5:19 AM

JP Nadda convoy pelted with stones during Diamond Harbour visit - Sakshi

డైమండ్‌ హార్బర్‌: పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఉదయం డైమండ్‌ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.

ఈ దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గీయ, ముకుల్‌ రాయ్‌ మరికొందరు నేతలు గాయపడ్డారు. ఇక కైలాస్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ నడ్డాకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తృణమూల్‌ పాలనలో బెంగాల్‌ లో అరాచకత్వం రాజ్య మేలుతోం దన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు ముఖ్యమంత్రి మమత ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తమపై తామే దాడులు చేసుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌పై నేరాన్ని నెట్టేస్తున్నారని అన్నారు. సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు చుట్టూ ఉండగా వారికెందుకు భయమని ప్రశ్నించారు.

దుర్గమ్మ ఆశీస్సులున్నాయి: నడ్డా
తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని నడ్డా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువ య్యాయని, గూండారాజ్‌ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లి పోయిందని ధ్వజమెత్తారు. ఆ దుర్గమ్మ దయవల్లే తనకేమీ కాలేదని వ్యాఖ్యానించారు. ‘‘కాన్వాయ్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి లోనయ్యాం. రాను రాను పశ్చిమ బెంగాల్‌లో అసహనం పెరిగిపోతోం ది. గూండాలు రాజ్యమేలుతున్నారు. భద్రత కల్పిం చడంలో అధికార యంత్రాంగం  విఫలమైంది’’ అని కార్యకర్తల సమావేశంలో  దుయ్యబట్టారు.

గాయపడిన విజయ వర్గీయ, ఆయన కారు డ్రైవర్‌


దాడిలో పగిలిన కారు అద్దం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement