పిల్లలా... వద్దులే! | India population hits 1. 46 billion fertility rate declines: UN report | Sakshi
Sakshi News home page

పిల్లలా... వద్దులే!

Jun 11 2025 2:24 AM | Updated on Jun 11 2025 2:24 AM

India population hits 1. 46 billion fertility rate declines: UN report

ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి

ఆర్థిక భారమే ప్రధాన కారణం

జనాభా వృద్ధిలో భారీ తగ్గుదల

ఐరాస అంతర్జాతీయ సర్వేలో వెల్లడి

ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేశాయి. జనాభా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిన రోజులవి. జనాభా వృద్ధి నానాటికీ నేలచూపులు చూస్తుండటం నేటికాలపు చేదు నిజం. భారత్‌ అనే కాదు, జనాభా వృద్ధిలో ప్రపంచమంతటా కనీవినీ ఎరగని రీతిలో భారీ తగ్గుదల నమోదవుతోంది! దాంతో వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. కానీ ఫలితం మాత్రం పెద్దగా కన్పించడం లేదు. నానాటికీ చుక్కలనంటున్న జీవనవ్యయమే దీనికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) సర్వే తేల్చింది.

పునరు త్పాదనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు ఈ ఐరాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాల్లో 14 వేల జంటలపై అధ్యయనం జరిపింది. ‘‘అత్యధికులకు ఎక్కువమందిని కనాలని ఉన్నా ఆకాశాన్నంటున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారమవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు’’ అని తేల్చింది. తమ శాంపిల్‌ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్నా సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 దేశాల్లో సర్వే జరపాలని యూఎన్‌ఎఫ్‌పీఏ నిర్ణయించింది.

ఇలా చేశారు
సర్వేలో సమాజంలోని అన్ని వర్గాల అభి ప్రాయాలూ సముచితంగా ప్రతిఫలించేలా యూఎన్‌ఎఫ్‌పీఏ జాగ్రత్తలు తీసుకుంది.
⇒  భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణకొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకూ సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూసింది. ప్రపంచ జనాభాలో మూడో వంతు ఈ దేశాల్లోనే ఉండటం విశేషం!

⇒  పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది. జననాల రేటు అత్యల్పంగా, అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కవరయ్యేలా జాగ్రత్త పడింది.

⇒  అల్పాదాయ, మధ్యతరగతి, సంపన్న జంటలు; యువ, మధ్యవయసు, 50 ఏళ్ల పైచిలుకు వారిని తగిన నిష్పత్తిలో ఎంపిక చేసుకున్నారు.

ఇదీ తేలింది
⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు.
⇒  సంతాన లేమికి వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొన్నది 12 శాతం మంది మాత్రమే!

⇒ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని, లేదా రెండో సంతానానికి వెళ్లలే దని 39% మంది వాపోయారు. ఇలాంటివా రి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా (58 %), స్వీడన్‌లో అత్యల్పంగా (19%) ఉంది.

⇒ ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు 50 ఏళ్ల పై చిలుకు వారిలో సగం మందికి పైగా                 అంగీకరించారు.
⇒  థాయ్‌లాండ్‌లో 19 శాతం మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపారు. తర్వాతి స్థానాల్లో అమెరికా (16 శాతం), దక్షిణాఫ్రికా (15 శాతం), నైజీరియా (14 శాతం), భారత్‌ (13 శాతం) ఉన్నాయి.
⇒ ఆఫీసుకు వెళ్లి రావడానికే రోజుకు సగటున మూడు గంటలు పోతోందంటూ చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదని వాపోయాయి.

40 ఏళ్ల కింద చాలా దేశాలు అధిక జనాభాతో సతమతమయ్యాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభమిది. దీనికి తోడు చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారుతోంది     
– డాక్టర్‌ నటాలియా కనెం, యూఎన్‌ఎఫ్‌పీఏ సారథి

భారత్‌లో కూడా..!
భారత్‌లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదిక వెల్లడించింది. అయితే అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికీ తగ్గిపోతోందని పేర్కొంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1 ఉండాలి. కానీ భారత్‌లో అది 1.9కి తగ్గినట్టు నివేదిక తెలిపింది.

నివేదిక విశేషాలు...
⇒ ప్రపంచ దేశాలన్నింట్లోనూ అత్యధిక యువతతో భారత్‌ కళకళలాడుతోంది. జనాభాలో 24 శాతం 0–14 ఏళ్ల వయసు వారున్నారు. 10–19 ఏళ్లు 17 శాతం కాగా  24 శాతం మంది 10–24 ఏళ్ల వయసువారు. 
⇒ జనాభాలో ఏకంగా 68 శాతం పనిచేసే వయసులో (15–64) ఉన్నారు. 
⇒  65 ఏళ్లు, ఆపైబడ్డ వృద్ధులు 7 శాతం. 
⇒ మహిళల్లో సగటు ఆయుప్రమాణం 74 ఏళ్లు కాగా పురుషుల్లో 71 ఏళ్లు. 
⇒ భారత్‌లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడినుంచి తగ్గుముఖం పడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement