
సేవలు చాలించనున్న యుద్ధ విమానాలు
ఆరు దశాబ్దాలుగా వాయుసేనకు అసమాన సేవలు
చండీగఢ్: భారత వాయుసేనకు ఆరు దశాబ్దాలపాటు వెన్నెముఖగా నిలిచిన ‘మిగ్ 21’యుద్ధ విమానాలు శుక్రవారం తమ సేవల నుంచి తప్పుకోనున్నాయి. చండీగఢ్లో ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ విమానాలకు వీడ్కోలు పలుకనున్నారు. చివరిసారి ఈ మిగ్ 21 విమానాన్ని ‘బదల్–3’కోడ్నేమ్తో వాయుసేన అధిపతి ఏపీ సింగ్ స్వయంగా నడుపనున్నారు. భారత వాయుసేనలో 23 స్వా్కడ్రన్లో ఈ యుద్ధ విమానాలు ఉంటాయి.
వీటిని పాంథర్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1963లో చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు తొలి మిగ్–21 విమాన స్వా్కడ్రన్ దిల్బాగ్సింగ్ నేతృత్వంలో వచి్చంది. ఆ తర్వాత ఆయన 1981లో వాయుసేన అధిపతి అయ్యారు. మిగ్–21 సేవలను కొనియాడుతూ వాయుసేన ఇటీవలే ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. ‘ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగని సేవలు, లెక్కలేనన్ని సాహసోపేత కథలు, దేశ గౌరవాన్ని దిగంతాలకు తీసుకెళ్లిన యుద్ధాశ్వం’అని కొనియాడింది.
మిగ్–21 డీకమిషనింగ్ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, సీడీఎస్ అనిల్చౌహాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వాయుసేన అధిపతి ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి తదితరులు హాజరు కానున్నారు. వాయుసేన మాజీ చీఫ్లు ఏవై తిప్నిస్, ఎస్ కృష్ణస్వామి, ఎస్పీ త్యాగి, పీవీ నాయక్, బీఎస్ ధనోవా, ఆర్కేఎస్ బదౌరియా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. డీకమిషనింగ్ కార్యక్రమంలో ఆరు మిగ్–21 యుద్ధ విమానాలు పాల్గొంటాయి. జాగ్వార్, తేజాస్ యుద్ధ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాయి.
డీకమిషనింగ్ కార్యక్రమం కోసం బుధవారం పూర్తిస్థాయిలో రిహార్సల్స్ నిర్వహించారు. భారత వాయుసేన ఇప్పటివరకు రష్యా నుంచి 870 మిగ్–21 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. పాకిస్తాన్తో 1965, 1971 యుద్ధాల్లో ఈ సూపర్సోనిక్ జెట్లు కీలకపాత్ర పోషించాయి. 1999లో కార్గిల్ ఘర్షణ, 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో కూడా ఈ యుద్ధ విమానాలు సేవలందించాయి. వాయుసేనకు అత్యుత్తమ సేవలు అందించినప్పటికీ మిగ్–21 విమానాలు తరుచూ కూలిపోవటం తీవ్ర విమర్శలకు, ఆందోళనకు దారితీసింది. ఇవి పాతబడిపోవటం, పాత తరానికి చెందినవి కావటంతో వాయుసేన సేవల నుంచి ఉపసంహరిస్తున్నారు.