నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి! | Hidden Gold Beneath the Himalayas: The Mystical Kamrunag Lake | Sakshi
Sakshi News home page

నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి!

Jun 22 2026 6:46 PM | Updated on Jun 23 2026 2:16 PM

Hidden Gold Beneath the Himalayas: The Mystical Kamrunag Lake

హిమాలయాల్లో ఓ పవిత్రమైన సరస్సు ఉంది. దాని అడుగు భాగంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అపారమైన బంగారు, వెండి ఆభరణాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆధ్యాత్మికతకు ఆలవాళంగా ఉన్న ఆ సరస్సులో.. నాగుపాము పడగను పోలిన పువ్వులుండే మొక్కలు ఎందుకున్నాయి..? సరస్సు అడుగుభాగంలోని నిధులను కాపాడేందుకు యక్షులు స్వయంగా ఈ మొక్కల రూపంలో నిఘా పెడతారా? లేక.. మరేమైనా విశేషాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే..  
హిమాలయ రాష్ట్రాల్లో కీలకమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో.. సముద్రమట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రమే కమ్రూనాగ్. ఇక్కడి కమ్రూనాగ్ సరస్సు ఎన్నెన్నో వింతలను తనలో ఇముడ్చుకుంది. మహాభారత కాలంలో రత్నాయుధుడు ఓ గొప్ప వీరుడు, యోధుడు. ఇతణ్నే కమ్రూనాగ్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి వ్యూహం ప్రకారం కమ్రూనాగ్ తన తలను త్యాగం చేయాల్సి రాగా.. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో నువ్వు భక్తులతో పూజలందుకుంటావని కృష్ణుడు వరమిచ్చాడు. అలా.. కమ్రూనాగ్ ఈ ప్రాంతంలో కొలువుదీరాడు..

కమ్రూనాగ్‌ ఒక యక్షుడు. ఆయనను పూజించే భక్తులు భక్తిభావంతో కమ్రూనాగ్ సరస్సులో బంగారు, వెండి నాణేలను వేయడం ఆనవాయితీగా మారింది. ద్వాపరయుగాంతం నుంచి మొదలుకుని.. కలియుగారంభం.. ఆ తర్వాతి కాలంలో భక్తులు వేసిన కానుకలతో ఈ సరస్సు అడుగు భాగం లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నాణేలకు నిలయంగా మారిపోయింది. ఈ నిధిని తస్కరించడానికి ఎవరూ సాహసించరు. అలా ప్రయత్నిస్తే.. ఇక్కడి నాగుపాములు, యక్షులు వారిని ఊరికే వదిలి పెట్టరని భక్తుల విశ్వాసం.

ప్రపంచంలో ఎక్కడా కనిపించని నాగుపాము పడగను పోలిన అరుదైన పుష్పాలు కమ్రూనాగ్ సరస్సు వద్ద దర్శనమిస్తాయి. వీటిని హిమాలయన్ కోబ్రాలిల్లీ అని పిలుస్తారు. స్థానికులు వీటిని బిషర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం అరిసెమా ప్రోపింక్వమ్. పువ్వు పైభాగం పడగ విప్పిన నాగుపాము ఆకారాన్ని పోలిఉంటుంది. అంతేకాదు.. పాము నాలిక బయటకు వచ్చినట్లుగా.. ఈ పువ్వు అగ్రభాగం కనిపిస్తుంది. ఈ పుష్పాలు గోధుమ, ఊదా, ఆకుపచ్చ రంగులతో చారలను కలిగి ఉంటాయి. మొదటిసారి ఈ పుష్పాలను చూసేవారు.. నిజంగానే అక్కడ పాము ఉందని భ్రమపడడం ఖాయం. కమ్రూనాగ్ ట్రెకింగ్ మార్గంలో, సరస్సు వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

అయితే.. యక్షులు ఈ పువ్వుల రూపంలో ఉంటూ కమ్రూనాగ్ సరస్సులోని నిధులను కాపాడుతారని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఈ సరస్సును చేరుకనేందుకు నేరుగా రోడ్డుమార్గం లేదు. మండి నుంచి రోహండా అనే గ్రామానికి చేరుకుని.. అక్కడి నుంచి నిటారైన కొండమార్గంలో 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. అలా కఠినమైన ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణించి, కమ్రూనాగ్ సరస్సును చేరుకోవచ్చు. మే నెల మొదలు.. అక్టోబరు వరకు ఈ మార్గం ట్రెకింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రతీఏడాది జూన్‌లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement