హత్రాస్‌ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం | Hathras Stampede People Stole Jewellery | Sakshi
Sakshi News home page

హత్రాస్‌ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం

Jul 10 2024 7:41 AM | Updated on Jul 10 2024 9:03 AM

Hathras Stampede People Stole Jewellery

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్‌లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్‌ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్‌లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్‌లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement