
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.
ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు.
ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు