పాడెపై వెళ్లి నామినేషన్‌! గోరఖ్‌పూర్‌లో విచిత్రం | Lok Sabha Elections 2024: Gorakhpur Independent Candidate Arrives On Bier To File Nomination Papers | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: పాడెపై వెళ్లి నామినేషన్‌!

May 15 2024 10:40 AM | Updated on May 15 2024 11:54 AM

Gorakhpur Independent candidate arrives on bier to file nomination papers

ఎన్నికల వేళ నామినేషన్‌ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్‌ వేశారు! ఆయన పేరు రాజన్‌ యాదవ్‌. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. 

దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. 

గమ్మత్తైన హామీలు 
రాజన్‌ యాదవ్‌ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్‌టైం ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్‌ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! 
– గోరఖ్‌పూర్‌   

Advertisement
 
Advertisement
Advertisement