సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి తన కోసం రాజ్యసభ సీటు కేటాయిస్తానంటే తాను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మహిళనని అక్కడి నుండి సీటు కేటాయించాలని తెలిపారు. తన సీటు కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
మధ్య ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అవకాశం లేదని బీజేపీకి అర్థమైందని అందుకే ఎన్నికల అధికారులతో కుమ్మక్కు అయ్యిందని ఆరోపించారు. నత్వానీ కి ఇచ్చిన అవకాశం తనకు ఎందుకు ఇవ్వలేదని? 2023 రూల్ బుక్ అడ్డం పెట్టుకొని నత్వాని కి నామినేషన్ కరెక్షన్ కోసం 24 గంటలు ఇచ్చారని తనకు మాత్రం 2026 రూల్ బుక్ ప్రకారం నామినేషన్ కరెక్షన్ కోసం ఆ అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.
తనకు సంబంధం లేని కేసు వల్ల నా నామినేషన్ తిరస్కరించారు. ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసులో నాకు లీగల్ నోటీస్ వచ్చింది. లీగల్ నోటీస్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్ అనే కాలమ్ లేనే లేదన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ స్థానం గెలవాలంటే 58 మంది మాత్రమే అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటని బీజేపీకి తెలుసు అయినప్పటికీ కుట్రలో భాగంగానే నామినేషన్ వేశారన్నారు.
తన కేసుల అంశాన్ని కాంగ్రెస్ నాయకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం బీజేపీ కావాలనే అబద్ధాలను సృష్టించింది. తానెప్పుడూ బాధితుల పక్షమేనని, శ్రీలతకు కూడా నేను అండగా ఉన్నానని తెలిపారు.రాజ్యసభ నామినేషన్ కేవలం కేసు ఉన్నంత మాత్రానా తిరస్కరణ కాలేదని, బీజేపీ,ఎన్నికల కమిషన్ పూర్తిగా కాంప్రమైజ్ అయింది కాబట్టే నామినేషన్ తిరస్కరణకు గురైందని తెలిపారు.కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చేస్తోందన్నారు.


