
నలుగురు మహిళల అరెస్ట్
రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు కిలేడీలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి(35), మాధవి(40),అకిల (30), విద్య(29)ను హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళకు చెందిన బంగారు గొలుసు చోరీకి గురవ్వడంతో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని పలు పోలీస్స్టేషన్లలో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ వేర్వేరు పనులు చేస్తున్నా ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ స్వంత ఊరికి వెళ్లిపోయేవారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.