శ్రీనగర్‌ నుంచి  ప్రత్యేక విమానాలు | Four special flights arranged from Srinagar Two to Delhi | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ నుంచి  ప్రత్యేక విమానాలు

Apr 24 2025 4:34 AM | Updated on Apr 24 2025 4:34 AM

Four special flights arranged from Srinagar Two to Delhi

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక చర్యలు

ఢిల్లీ, ముంబైకి నాలుగు ప్రత్యేక విమానాల ఏర్పాటు 

టికెట్ల ధరలు పెంచరాదని విమాన సంస్థలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత పర్యాటకులు, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రితో సమన్వయంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు చర్యలు చేపట్టి,  శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి రెండు, ముంబైకి రెండు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికులపై భారం పడరాదన్న ఉద్దేశంతో విమాన ధరలకు రెక్కలకు బ్రేక్‌ వేస్తూ ఏకకాలంలో టికెట్ల ధరలు పెరగకుండా ఉండేందుకు అన్ని ఎయిర్‌లైన్స్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

 ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి, కశ్మీర్‌లో ఉన్న తెలుగు పర్యాటకుల రాకపోకలు సమన్వయం చేసేలా చర్యలు చేపట్టారు. 

అంతేకాకుండా, పహల్గామ్‌ వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని గౌరవంగా విమానమార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల తరలింపునకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎయిర్‌లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement