
వేలూరు: ఓ మాజీ సిపాయి తనకు చెందిన రూ.4 కోట్ల విలువైన భూమి పత్రాలను రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేశాడు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని పడవేడు గ్రామానికి చెందిన విజయన్ మాజీ ఆర్మీ సిపాయి. ఇతనికి భార్య కస్తూరి ఉంది. ఈమె కన్నమంగళం సమీపంలోని మంగళాపురంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలకు వివాహం కావడంతో ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ సిపాయి విజయన్కు భార్య కస్తూరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. విజయన్ మాత్రం ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో విజయన్ మనోవేదనతో ఉండేవాడు. దీంతో మే 2వ తేదీన జిల్లాలోని పడవేడులోని రేణుకాంబాల్ ఆలయానికి స్వామివారి దర్శనం కోసం విజయన్ వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం రూ.4 కోట్ల విలువ చేసే భూ పత్రాలను హుండీలో వేశాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వెళ్లాడు.
మంగళవారం ఉదయం రేణుకాంబల్ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఆలయానికి వచ్చాడు. అనంతరం ఆలయ నిర్వహకులతో మాట్లాడి ఆలయ హుండీలో రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలున్నాయని, వాటన్నింటిని ఆలయాన్ని రాసి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆస్తి కోసం తన కుమార్తెలు నిత్యం వేధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయన్ వెల్లడించారు.
విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది, స్థానికులు అవాక్కయ్యారు. విజయన్ ఆలయ హుండీల్లో ఆస్తి పత్రాలు వేసిన విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు ఆలయానికి వచ్చారు. ఆస్తి తమదని, ఆ పత్రం తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఆస్తిపత్రం తమ దగ్గరే ఉంటుందని దేవస్థానం అధికారులు వారికి స్పష్టం చేశారు.