
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారికంగా నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. నోటిఫికేషన్లోని వివరాల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీ.ఈ పత్రాలను ఆగస్టు 22న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీ.
జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నిక తప్పనిసరి అయింది. ధన్ఖడ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన రాజీనామా లేఖలో క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ధన్ఖడ్ పదవీకాలం ఆగస్టు 2027లో ముగియనుంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్సభ,రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీ విప్కి కట్టుబడి ఉండనవసరం లేదు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. ఈ కారణంగా ఎన్డీఏ తన అభ్యర్థిని సులభంగా ఎన్నుకోగలదు. రెండు సభల ప్రస్తుత బలం 786. అభ్యర్థి గెలవడానికి 394 ఓట్లు అవసరం. ఎన్డీఏకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు మొత్తం ఓట్ల బలం 422. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికం.