
గృహ హింస బాధితురాలికి ఆ పరిహారం సబబే
ఆమె భర్త దగ్గర భాగా డబ్బుంది
వ్యాఖ్యానించిన ముంబై కోర్టు
ముంబై: గృహ హింస బాధితురాలిగా ఉన్న ఓ మహిళకు ఇవ్వాల్సిన పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతూ ముంబైలోని ఓ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎలివేటర్ కంపెనీని నడిపే ఈమె భర్త వద్ద భారీగానే డబ్బుందని, అతడిది కోటీశ్వరుల కుటుంబమని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తన భర్తతో కలిసి ఉన్న సుదీర్ఘమైన 20 ఏళ్ల సమయంలో అనూహ్యమైన శారీరక, మానసిక హింస ఎదుర్కొన్నారని పేర్కొన్న న్యాయస్థానం..నిర్వహణ ఖర్చుల కింద భార్య, కుమార్తెకు నెలకు భర్త ఇచ్చే మొత్తాన్ని సైతం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచింది.
మేజి్రస్టేట్ కోర్టు 2020లో ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ బాధితురాలు(41) వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన డిండోషి లోని అదనపు సెషన్స్ జడ్జి ఎస్జే అన్సారీ గత నెలలో గృహ హింస నిరోధక చట్టం కింద ఈ మేరకు తీర్పు వెలువరించారు. 1997లో వివాహమైనప్పటి నుంచి పిటిషనర్ అయిన బాధితురాలిని భర్త, అతడి కుటుంబం శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేదనకు, అవమానాలకు గురి చేశారని జడ్జి అన్సారీ తీర్పులో పేర్కొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా బాధితురాలు భరణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
భార్య కారణంగా తాను ఆర్థికంగా చితికిపోయానని, ఇద్దరు కుమారుల చదువులు, పోషణ కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నానని, ఉండే ఇంటికి అద్దె సైతం చెల్లించలేని స్థితిలో ఉన్నానంటూ భర్త చేసిన వినతిని జడ్జి తోసిపుచ్చారు. ఇందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారని ఎత్తి చూపారు. 2012లో కోటి విలువ చేసే భూమిని కొనుగోలు చేయడంతోపాటు ఎలివేటర్ కంపెనీ నడుపుతున్న అతడి వద్ద డబ్బు మూలుగుతోందని వ్యాఖ్యానించారు. ‘పిటిషనర్ ఇప్పుడు తన ఇద్దరు కుమారుల నుంచి దూరంగా ఉంటూ వేదన అనుభవిస్తున్నారు. ఆ కుమారులిద్దరినీ తల్లికి వ్యతిరేకంగా భర్త మార్చినట్లు కూడా కనిపిస్తోంది. ఇది విస్మరించలేని అంశం’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పరిహారంతో పాటు మహిళకు, ఆమె కుమార్తెకు మంజూరు చేసిన భరణం మొత్తాన్ని కూడా పెంచామని స్పష్టం చేశారు.