భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య నోరు జారింది. భర్త తట్టుకోలేకపోయాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా రాయి తీసుకుని దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో చేసిన నేరానికి వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ, సమాజం ఊరుకోలేదు!. కోర్టు జీవితఖైదు విధించి తన పని తాను చేసింది. అయితే ఒక్క మాటతో ఆ తీర్పును ఇప్పుడు తిరగరాయాల్సి వచ్చింది.
ఐదేళ్ల కిందట.. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన గర్భిణీ హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మాటామాటా పెరిగి కిరణ్ అనే మహిళను ఆమె భర్త శివ రాళ్లతో దాడి చేసి చంపాడు. ఆపై విషయాన్ని ఇరు వైపులా కుటుంబాలకు తెలియజేశాడు. అయితే.. ఆమె కడుపుతో ఉండడం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు విధించింది. అయితే..
ఈ శిక్ష పునఃపరిశీలన కోసం తాజాగా ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. నిందితుడి జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా మార్చేసింది. కేసు విచారణలో కీలకంగా మారిన అంశం.. గొడవ సమయంలో భార్య చేసిన ఒక వ్యాఖ్య.
కిరణ్ తన భర్తను ఉద్దేశించి “నువ్వు కాకపోతే.. నీలాంటి వందల మంది నాకు మొగుళ్లుగా దొరుకుతారు” అని అన్నదట. ఈ మాట తనలో తీవ్ర ఆవేశాన్ని రేపిందని, అదే ఆవేశంలో రాయితో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని శివ కోర్టుకు తెలిపాడు. ఆధారాలను, వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవినీంద్ర కుమార్ సింగ్.. Grave and sudden provocationను పరిగణనలోకి తీసుకున్నారు.
ఇది క్షణికావేశంలో జరిగిన నేరంగా భావించిన ధర్మాసనం.. దాడి జరిగిన వెంటనే నిందితుడు స్వయంగా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. “అది ప్రణాళికాబద్ధ(ప్లాన్ప్రకారం చేసిన) హత్య కాదు. కోపంలో జరిగింది అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 1 వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల హత్యగా కాకుండా ‘కల్పబుల్ హోమిసైడ్’ (Section 304 Part II) కింద కేసును పరిగణించింది. జీవితఖైదును కాస్త.. ఏడేళ్ల శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.
Grave and sudden provocation (IPC సెక్షన్ 300 Exception 1).. దీని ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అవమానం లేదంటే తీవ్ర ఆవేశాన్ని రేపే మాట/పరిస్థితిని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు.. నియంత్రణ కోల్పోయి నేరం చేయడం..
అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మాటల ప్రభావం, గృహహింస కేసుల్లో భావోద్వేగ ప్రేరణ పాత్ర వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయపరమైన సడలింపు సరైన దేనా? అనే ప్రశ్నలు వస్తుండగా, మరోవైపు భావోద్వేగ ఆవేశంలో జరిగే నేరాలపై చట్టం ఎలా స్పందించాలన్నదానిపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి.


