‘బాలికకు అతికిన ఎముకను మళ్లీ విరగొట్టాడు’ | Up Doctor Re Breaks Child Leg After Mother Could Not Pay Bribe | Sakshi
Sakshi News home page

‘బాలికకు అతికిన ఎముకను మళ్లీ విరగొట్టాడు’

Jun 4 2026 3:51 PM | Updated on Jun 4 2026 4:03 PM

Up Doctor Re Breaks Child Leg After Mother Could Not Pay Bribe

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిపే అమానవీయ ఘటన జరిగింది. లంచం ఇవ్వలేదనే కారణంతో 14 ఏళ్ల బాలికకు అతికిన ఎముకను ప్రభుత్వ వైద్యుడు మళ్లీ విరిచేశాడు. గాయపడిన బాలిక చికిత్సకు ఆ డాక్టర్‌ రూ.  25 వేలు డిమాండ్‌ చేశాడు. అప్పటికే బాధిత కుటుంబం రూ. 8 వేలు చెల్లించింది. డిమాండ్‌ చేసిన రూ.25 వేలు ఇవ్వలేదనే కారణంతో బాలికను పరీక్షల నిమిత్తం పిలిచి కాలు విరిచాడు.

దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తక్షణమే ఉచిత చికిత్స అందించాలంటూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనను తెలుసుకున్న కలెక్టర్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. దాదాపు నెలన్నర క్రితం మానసిక వికలాంగురాలైన తన కుమార్తె కుడి కాలు ఎముక విరిగింది. దాంతో ఆమె కూతురిని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఆపరేషన్ చేయడానికి రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు.

భర్త మరణించిన తర్వాత ఒంటరిగా పిల్లలను పోషిస్తున్న ఆమె.. అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలైన తల్లి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ను ఆశ్రయించింది. డీఎం జోక్యం చేసుకుని.. ఉచితంగా చికిత్స అందించాలని సీఎంఓకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వైఖరిలో మార్పు రాలేదు.

డీఎం దగ్గరకు ఎందుకు వెళ్లావంటూ వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి.. చికిత్స చేయడానికి నిరాకరించారు. చివరికి చేసేదేమీ లేక ఆ తల్లి అప్పు చేసి రూ.8 వేలు ఇవ్వడంతో బాలికకు ఆపరేషన్ చేశారు. మిగిలిన డబ్బును తర్వాత ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధిత తల్లి తన కుమార్తెను ఫాలో-అప్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఉన్న డాక్టర్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడి.. మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తన వద్ద డబ్బులు లేవని  ఆమె చెప్పడంతో.. ఆగ్రహించిన డాక్టర్ ఆ బాలిక మోకాలిని ఎంత ఘోరంగా మెలి తిప్పాడు. ఆ పిల్ల నొప్పితో గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో కాలు ఎముక విరిగిన శబ్దం స్పష్టంగా వినిపించిందని ఆమె తెలిపింది. దీంతో ఆమె నిలదీయగా.. వైద్యులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి.. బలవంతంగా ఆసుపత్రి నుండి బయటకు నెట్టేశారు.

ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కాలు విపరీతంగా వాచిపోయి.. రాత్రంతా నొప్పితో విలవిలల్లాడటంతో.. తల్లి ప్రైవేట్ ల్యాబ్‌లో డిజిటల్ ఎక్స్-రే చేయించింది. ఎక్స్-రే రిపోర్టులో బాలిక కాలు ఎముక మళ్లీ విరిగినట్లు స్పష్టంగా తేలింది. దీనిపై నిలదీయడానికి మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా..  వైద్యులు న్యాయం చేయడానికి బదులు.. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుండి తరిమికొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement