యూత్‌ కాంగ్రెస్‌ నుంచి సీఎం పీఠం దాకా.. | DK Shivakumar political journey | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌ నుంచి సీఎం పీఠం దాకా..

Jun 3 2026 6:11 AM | Updated on Jun 3 2026 6:11 AM

DK Shivakumar political journey

నాలుగు దశాబ్దాలపాటు పార్టీ పదవుల్లో క్రమంగా ఎదుగుతూ వచ్చిన డి.కె. శివకుమార్, యువ కాంగ్రెస్‌ నాయకుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరుకున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. ఈ నేపథ్యంలో శివకుమార్‌ జీవితంలోని ప్రధాన ఘట్టాల సమాహారం ఇలా.. 
   – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

1962
డొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్‌ డొడ్డా అలహ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుత బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర సమీపంలో ఉంది. ఆయన ప్రభావవంతమైన వొక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారు.

1980    
 తొలినాళ్లలో.. రేణుకాచార్య కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు.

1983
ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌లో చేరి కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

1985 
మాజీ ప్రధాని దేవెగౌడపై కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో రెండు కుటుంబాల మధ్య దీర్ఘకాల రాజకీయ పోటీ ప్రారంభమైంది.

1989
27 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌ పార్టీ తనకు టికెట్‌ నిరాకరించడంతో సాతనూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 

1991 
ముఖ్యమంత్రి బంగారప్ప ప్రభుత్వంలో జైళ్లు, హోంగార్డుల శాఖ జూనియర్‌ మంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు.

1994 
సాతనూర్‌ నుంచి రెండోసారి స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.ఎం. కృష్ణకు సన్నిహితుడిగా, ఆయన కుడిభుజంగా నిలిచారు.

1999
వరుసగా మూడో ఎన్నికల్లోనూ గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి హెచ్‌.డి. కుమారస్వామిని ఓడించారు. తొలుత సహకార శాఖ, ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2004 
మరోసారి ఎన్నికల్లో గెలిచారు. జేడీఎస్‌– బీజేపీతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో చేరకుండా కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిగా కొనసాగారు.

2008
నియోజకవర్గాల పునరి్వభజన వల్ల సాతనూరు నియోజకవర్గం కనుమరుగు కావడంతో కనకపుర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

2013 
మళ్లీ గెలిచినప్పటికీ అవినీతి ఆరోపణల కారణంగా తొలుత సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించలేదు. కానీ ఆ తర్వాత హైకమాండ్‌ జోక్యంతో ఆయన్నుతీసుకోవడంతో మంత్రి అయ్యారు.

2017
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడైన అహ్మద్‌ పటేల్‌ను తిరిగి రాజ్యసభకు పంపేందుకు గుజరాత్‌  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడటం ద్వారా పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన వెంటనే ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి.

2018
ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జల వనరులు, వైద్యవిద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 

2019 
మనీలాండరింగ్‌ ఆరోపణలపై 50 రోజులు జైలుపాలై.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ సందర్భంగా సోనియా, రాహుల్‌ గాంధీ ఆయన్ను పరామర్శించారు. ప్రజలు తనకు రాజకీయ అధికారం కట్టబెట్టేదాకా గడ్డం తీయనంటూ శపథం చేశారు.

2020
కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తాను సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు.

2022 
కోవిడ్‌ కాలంలో మేకేదాటు పాదయాత్ర ప్రారంభించారు. కావేరి జలాల అంశంపై దక్షిణ కర్ణాటకలో బలమైన ప్రజా మద్దతు కూడగట్టారు.

2023
కాంగ్రెస్‌ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. కానీ అంతర్గతంగా కుదిరిన అధికార పంపిణీ ఒప్పందం దృష్ట్యా అధిష్టానం ఓపిక పట్టాలని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. 

2026 
ముఖ్యమంత్రి కావాలనే కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement