డిజిటల్‌ ఇండియాతో భారత్‌కు కొత్త గుర్తింపు | Digital India has given India new identity worldwide: PM Modi | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఇండియాతో భారత్‌కు కొత్త గుర్తింపు

Jul 2 2026 4:45 AM | Updated on Jul 2 2026 4:45 AM

Digital India has given India new identity worldwide: PM Modi

ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఇండియా కార్యక్రమం భారతదేశానికి అంతర్జాతీయంగా కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పరిపాలనకు కొత్త నిర్వచనాన్నిచ్చిన ఈ కార్యక్రమం పౌరుల సాధికారతకు ఉపయోగపడిందని, జీవితపు ప్రతి పార్శా్వన్నీ తాకుతూ సమగ్రాభివృద్ధిని వేగవంతం చేసిందని అన్నారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రధాని ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... డిజిటల్‌ చెల్లింపులు మొదలుకొని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ వరకూ అంతకంతకూ విస్తరిస్తున్న డిజిటల్‌ మౌలిక సదుపాయాలతో పౌరుల జీవితం మరింత సుఖమయమైందని అన్నారు.

‘‘డిజిటల్‌ ఇండియా ఆవిష్కరణలు భారత్‌లోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించింది’’అని ఆయన అన్నారు. యవ పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్‌ కంపెనీలు ఇన్నొవేటర్లు డిజిటల్‌ మౌలిక సదుపాయాల సాయంతో ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలు ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవలను బలోపేతం చేసిందని, పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లోనూ దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు.

‘‘డిజిటల్‌ ఇండియా కూడా వృద్ధి, అవకాశాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రతి పౌరుడిని శక్తిమంతులను చేసే, సుస్థిరాభివృద్ధికి ప్రోత్సాహమిచ్చే మానవాళి సేవకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడేలా చేసే భవిష్యత్తును సృష్టించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని అన్నారు. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ భారత్‌కు డిజిటల్‌ ఇండియా బలమైన పునాది అని, పేదలు, వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడంలో, పౌరుల జీవితాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పారు.

‘‘ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ల విస్తరణ నుంచి డిజిటల్‌ లావాదేవీల వరకు, ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్‌పై నిలిపాయి’’అని ఆయన అన్నారు. ‘‘వందకోట్లకు పైబడ్డ ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తే, దాని ప్రభావం విప్లవాత్మకమైన మార్పులకు నాందీగా ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement