
కోర్టు ధిక్కారం కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు
రూ.లక్ష జరిమానా విధించిన బీఆర్ గవాయ్ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తహసీల్దార్ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, గుంటూరు జిల్లాలో మురికివాడల నివాసితుల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ కలెక్టర్ మోహనరావును తహసీల్దార్గా డిమోట్చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.లక్ష జరిమానా విధించి నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్ధారించి, 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా ‘చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా 2014 జనవరిలో అప్పటి తహసీల్దార్గా ఉన్న మోహనరావు గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును మోహనరావు ఆశ్రయించగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా వాదోపవాదాల అనంతరం మోహనరావు ఎటువంటి క్షమకు అర్హులు కానప్పటికీ, ఆయన పిల్లలు, కుటుంబాన్ని బాధపెట్టరాదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
డిప్యూటీ కలెక్టర్ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే, ఆయన తన ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉన్నందున దయ చూపిస్తున్నామని, డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్గా డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు వెల్లడించింది. డీమోట్ విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోతే తిరిగి ఉద్యోగంలో నియమించకుండా చూస్తామని పేర్కొంది. దీంతో డిమోట్ విషయంలో మోహనరావును ఒప్పించడానికి న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది.