ఉత్తరాదిపై మంచుదుప్పటి | Dense fog and cold waves are gripping North India | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిపై మంచుదుప్పటి

Dec 21 2025 6:21 AM | Updated on Dec 21 2025 6:21 AM

Dense fog and cold waves are gripping North India

కశ్మీర్, హిమాచల్‌లలో ఎముకలు కొరికే చలి

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ..ఉత్తర భారతంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. పగలంతా దట్టమైన పొగమంచు కొనసాగుతుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అక్కడక్కడా మంచు, వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తుందని తెలిపింది. కశ్మీర్‌లో 40 రోజులపాటు అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల కాలం చిల్లై కలాన్‌ ఆదివారం నుంచి మొదలుకానుంది. పుల్వామాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా మైనస్‌ 3.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, శ్రీనగర్‌లో మైనస్‌ 0.4 డిగ్రీ, అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ ఉన్న పహల్గాంలో మైనస్‌ ఒక డిగ్రీగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉందని పేర్కొంది. శ్రీనగర్‌తోపాటు లోయలోని అత్యధిక ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుందని పేర్కొంది. అదేసమయంలో, హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, మండి జిల్లాలతోఆపటు బాల్హ్‌లోయలో ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఈ నెల 25వ తేదీ వరకు పర్వత ప్రాంతాల్లో అక్కడక్కడా కొద్దిపాటి మంచు, వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. కుకుమ్‌సెరి, లాహోల్‌ స్పిటి జిల్లాలో మైనస్‌ 5.7 డిగ్రీలు, టాబోలో మైనస్‌ 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ విభాగం తెలిపింది. 

ఢిల్లీలో ఆరెంజ్‌ అలెర్ట్‌ 
వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడిని మేఘాలు కమ్మేశాయి. దీంతో, దృగ్గోచరత క్షీణించింది. ఢిల్లీలో శీతల గాలుల సీజన్‌ శనివారం నుంచి మొదలైంది. ఈ నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. 

గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వీస్తున్న గాలులు కాలుష్య కారకాలు చెల్లాచెదురయ్యేందుకు అనుకూలం కావని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం మరో రెండు రోజులపాటు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, కాన్పుర్, బరేలీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో దృగ్గోచరత 50 మీటర్లలోపునే ఉంది. పంజాబ్, హరియాణాలతో కూడా తీవ్ర శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాజస్తాన్, జార్ఖండ్‌లలోనూ ఇవే పరిస్థితులున్నాయి.

129 విమానాలు రద్దు
ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగా విమానాశ్రయం అధికారులు ముందు జాగ్రత్తగా కనీసం 129 విమాన సర్వీసులను రద్దు చేశారు. తక్కువ దృగ్గోచరత కారణంగా కొన్ని రోజులుగా ఢిల్లీ, ఇతర విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అత్యంత పెద్దది. నిత్యం ఇక్కడ 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement