
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది.
తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.
గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే.