సంజయ్‌ రాయ్‌ దోషే  | Court Will Verdict Over RG Kar Medial College And Hospital Doctor Murder Case, Check More Details Inside | Sakshi
Sakshi News home page

సంజయ్‌ రాయ్‌ దోషే 

Published Sat, Jan 18 2025 9:27 AM | Last Updated on Sun, Jan 19 2025 4:14 AM

Court Will Verdict Over RG Kar Medial College and Hospital Case details

ఆర్‌జీ కర్‌ హత్యాచార ఘటనపై కోర్టు తీర్పు

సోమవారం శిక్ష ఖరారు 

బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2024 ఆగస్ట్‌ 9న జరిగిన ఈ దారుణంపై నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రాయ్‌పై భారతీయ న్యాయ సహిత సెక్షన్లు 64, 66తో పాటు మరణ శిక్ష, లేదా జీవిత ఖైదుకు వీలు కలి్పంచే 103(1) కింద కేసులు నమోదయ్యాయి. 

వాటిపై 2024 నవంబర్‌ 12 నుంచి సీల్డా అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి అనిర్బణ్‌ దాస్‌ రెండు నెలలపాటు రహస్య విచారణ జరిపారు. రాయ్‌పై మోపిన అన్ని ఆరోపణలనూ సీబీఐ రుజువు చేసిందని పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే గాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందన్నారు. ‘‘తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొరబడ్డావు. సెమినార్‌ హాల్‌లో నిద్రిస్తున్న ఆన్‌డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి, వాదనలు విన్న మీదట నువ్వే దోషివని నిర్ధారించా. నిన్ను శిక్షించాల్సిందే’’ అని నిందితున్ని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. 

కేసులో ఇరికించారు 
తనను ఈ కేసులో ఇరికించారని రాయ్‌ అన్నాడు. ‘‘నేనే గనుక ఈ నేరం చేసుంటే నా మెడలోని రుద్రాక్షమాల అక్కడే తెగిపోయి ఉండేది’’ అన్నాడు. ‘నన్నీ కేసులో ఇరికించిన వారిని ఎందుకు వదిలేశారు?’ అని ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఎస్‌హెచ్‌వోలను ఉద్దేశించి ప్రశ్నించాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు దోషి వాంగ్మూలం తీసుకుంటామని, అనంతరం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరిస్తానని జడ్జి తెలిపారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన పలు అంశాలకు కూడా అందులో బదులిస్తానని చెప్పారు. తర్వాత రాయ్‌ను పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షనల్‌ హోంకు తీసుకెళ్లారు. అతడిని మీడియాతో మాట్లాడనివ్వలేదు. తీర్పును పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ స్వాగతించగా ఇక పార్టీ ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. 

తుదిశ్వాస వరకు పోరాడుతాం 
తీర్పు విన్నాక బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘మీపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు’ అని జడ్జినుద్దేశించి పేర్కొన్నారు. తల్లి మాత్రం పూర్తి న్యాయం జరగలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కుమార్తెను చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్న రాయ్‌ విచారణ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. ఈ దారుణానికి అతడొక్కడే కారణం కాదు. ఇతర దోషులనూ చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు తుదిశ్వాస దాకా పోరాడతాం’’ అని చెప్పారు. 

కుట్ర తేలేదాకా పోరు: వైద్యులు 
పాక్షిక న్యాయమే జరిగిందంటూ తీర్పు అనంతరం జూనియర్‌ వైద్యులు పెదవి విరిచారు. ‘‘ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ నేరంతో పెద్ద వ్యక్తులకు కచి్చతంగా సంబంధముంది. అందుకే క్రైం సీన్‌ను మార్చేశారు. ఆధారాలను చెరిపేశారు. ఆ దిశగా మరింత విచారణ జరపాలి’’ అని డిమాండ్‌ చేశారు. అప్పటిదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాయ్‌ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతుండగా ఇందులో మరికొందరి హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యులు వాదిస్తుండటం తెలిసిందే. 

50 మంది సాక్షులు 
కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్‌ అయిన రాయ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. నవంబర్‌ 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడు రాయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్‌ రాయ్‌ సోదరి తెలిపారు. ‘‘అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాల్సిందే. విచారణకు మా కుటుంబం హాజరవడం లేదు’’ అని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement