వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది | Coronavirus: Covid Vaccine Doses Crossed 34 Crores In India | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది

Jul 4 2021 8:12 AM | Updated on Jul 4 2021 8:41 AM

Coronavirus: Covid Vaccine Doses Crossed 34 Crores In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్‌ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో  కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement