బెంగాల్‌ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు | Bengal train accident case: Complainant's U-turn | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ రైలు ప్రమాదం కేసులో ఊహించని మలుపు

Jun 19 2024 10:19 AM | Updated on Jun 19 2024 10:30 AM

Complainant U Turn in Bengal train accident Case

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ కాంచన్‌జంగా రైలు ప్రమాదం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఇప్పటిదాకా పది మంది మరణించగా.. 40 మందికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు మాట మార్చారు. అసలు తాను ఫిర్యాదే చేయలేదని బాంబ్‌ పేల్చారు.

బెంగాల్‌ రైలు ప్రమాదంపై జల్‌పాయ్‌గురి రైల్వే పోలీసులు(GRP) మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. లోకో పైలట్‌, కో-పైలట్‌ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతూ.. చైతలి మజుందార్‌ అనే ప్రయాణికురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

‘‘రైలు రంగపాణి-నిజ్బరి స్టేషన్ల మధ్య ఉండగా.. హఠాత్తుగా కుదుపులకు లోనైంది. మా బోగీలో ఉన్నవాళ్లమంతా అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈలోపు స్థానికులు తీవ్రంగా గాయపడిన మమ్మల్ని బయటకు తీశారు. బయటకు వచ్చి చూస్తే మా రైలును వెనుక నుంచి గూడ్స్‌ ఢీ కొట్టింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనూ కొందరు చనిపోయారు. పైలట్‌-లోకో పైలట్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నా’’ అని ఫిర్యాదులో ఉంది.   

అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్‌ మరణించగా.. లోకో పైలట్‌ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు చైతలి ఫిర్యాదు ఆధారంగానే ఇండియన్‌ రైల్వేస్‌ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఈలోపే ఆమె ట్విస్ట్‌ ఇచ్చారు. తాను అసలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చారు. జీఆర్పీ అధికారులు ఓ తెల్లకాగితంపై తనతో సంతకం చేయించుకున్నారని..  దానినే ఫిర్యాదులేఖగా మార్చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆమె ఆరోపించారు. అయితే మజుందార్‌ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement