భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ | BSF Soldier Died On Jaisalmer Border Due To Sun Stroke, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ

May 27 2024 1:07 PM | Updated on May 27 2024 4:24 PM

BSF Soldier Died on Jaisalmer Border

దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో  విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ  కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీఎస్‌ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్‌ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement