BJP Mocks Rahul Gandhi Bharat Jodo Yatra With Animated Video - Sakshi
Sakshi News home page

ఖతం.. టాటా.. వీడ్కోలు..! భారత్‌ జోడో యాత్రపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు

Published Mon, Oct 17 2022 7:54 AM

BJP Mocks Rahul Gandhi Bharat Jodo Yatra With Animated Video - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి పునఃర్‌వైభవం తీసుకొచ్చేందుకు భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్‌ గాంధీ. యాత్ర మొదలైనప్పుటి నుంచి రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. తాజాగా ఓ యానిమేటెడ్‌ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. అందుకు కాంగ్రెస్‌ సైతం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారత్‌ జోడో యాత్ర లక్ష్యంగా రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల వీడియోను అధికార బీజేపీ విడుదల చేసింది. దానికి కౌంటర్‌గా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ విఫలమైనట్లు సూచిస్తూ కాంగ్రెస్‌ మరో వీడియోను షేర్‌ చేసింది. 

బీజేపీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో నేతల రాజీనామాలు, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటును సూచిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ గాంధీని ఓదార్చుతున్నట్లు చూపించారు. ఈ సందర్భంగా.. ‘ అమ్మా చెడ్డ రోజులు ఎందుకు అంతం కావు? ఇది ముగిసింది, టాటా.. వీడ్కోలు..’ అంటూ సోనియాను రాహుల్‌ అడిగినట్లు పేర్కొంది.

కాంగ్రెస్‌ కౌంటర్‌ వీడియో..
బీజేపీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ కౌంటర్‌ అటాక్‌ చేసింది. ప్రజలు గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి వాటిపై ప్రశ్నిస్తుంటే ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో చూపించింది కాంగ్రెస్‌. దుష్మాన్‌ సినిమాలోని ‘వాదా తేరా వాదా’ పాట వస్తుండగా మోదీ పరుగులు పెట్టినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి

Advertisement
Advertisement