బీజేపీ నూతన చీఫ్‌ ఎంపిక వేగవంతం | BJP to elect new national president by April-end or early May 2025 | Sakshi
Sakshi News home page

బీజేపీ నూతన చీఫ్‌ ఎంపిక వేగవంతం

Apr 18 2025 6:13 AM | Updated on Apr 18 2025 11:45 AM

BJP to elect new national president by April-end or early May 2025

జాతీయ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అగ్రనేతల కీలక మంతనాలు 

20వ తేదీ తర్వాత అధ్యక్షుడి నామినేషన్‌ ప్రక్రియ షురూ 

త్వరలో మరిన్ని రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు 

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ అగ్ర నాయకత్వం వేగవంతం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షు ల ఎంపికను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసేందుకు అగ్రనేతలు విస్తృత సంప్రదింపులు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మూడు గంటల పాటు కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ లు పాల్గొన్నారు. 

ఈ చర్చల అనంతరం అమిత్‌ షా, రాజ్‌నాథ్, సంతోష్   ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత అమిత్‌ షా, నడ్డా విడిగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించడంతో పాటు ఈ నెల 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్టీ జాతీయ ఎన్నికల అధికారి తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. 

ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే ప్రణాళికతో పార్టీ ముందుకెళ్లనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత భేటీలో ఐదారుగురు నేతల పేర్లే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, బీఎల్‌ సంతోశ్ తో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2020 ఫిబ్రవరిలో నడ్డా తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. పరిమిత మూడేళ్ల కాలం పూర్తయ్యాక కూడా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. దాంతో ఇప్పటికీ ఆయనే అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు.  

త్వరలో తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన 
బీజేపీ ఇప్పటివరకు 15 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించింది. ఏప్రిల్‌ 19 లేదా 20వ తేదీన మరో ఆరేడు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తోంది. పార్టీ సొంత నియమనిబంధనావళి ప్రకారం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

అధ్యక్షుల ప్రకటన తర్వాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రేసులో పురందేశ్వరి, మాధవ్, పార్థిసారధి రెడ్డిల పేర్లపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర సైతం ఉంటుందని తెలుస్తోంది. బిహార్‌లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగొచ్చు. పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు ఉండొచ్చు. ఈ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో కమలదళ సారథుల ఎంపిక కొనసాగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement