
ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ప్రకటించే అవకాశం
రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నికపై కొనసాగుతున్న కసరత్తు
న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీ నియమావళి ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర శాఖల (స్టేట్ యూనిట్ల) అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలి. దేశవ్యాప్తంగా బీజేపీకి 37 రాష్ట్ర శాఖలు ఉన్నాయి. అంటే 19 రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటివరకు పార్టీ 14 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిచేసింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశముంది. జూలై రెండో వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఇలా..
బీజేపీ దశలవారీ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిని ఎంచుకుంటుంది. ముందుగా బూత్ అధ్యక్షులు, ఆ తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు. సగం జిల్లాల అధ్యక్షులు ఎంపికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు. అలాగే 19 రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. చాలా సందర్భాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవ పద్ధతిలోనే జరుగుతాయి. పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కలిసి బీజేపీ జాతీయ అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేస్తారు.
కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లు
జేపీ నడ్డా జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం జనవరి 2023లోనే ముగిసింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టారు. కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2025లో బిహార్, 2026లో పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది.
కుల, ప్రాంత సమీకరణపై దృష్టి
కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో కుల సమీకరణ, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటారు. పలువురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అందువల్ల కేంద్ర కేబినెట్లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి మోదీ జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశాల నుంచి తిరిగివచి్చన తర్వాత, జూలై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.