లుథియానా: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘వ్యవస్థను మారుద్దాం, ఉద్యమంలో భాగస్వాములుకండి’ అంటూ వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి ఇప్పటికే పలువురు బాధితులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని లుథియానా పోలీసులు ఒక అధికారిక వీడియోను విడుదల చేస్తూ, ఈ సైబర్ ఉచ్చులో పడవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.
నకిలీ మెంబర్షిప్
ఈ కుట్రలో భాగంగా సైబర్ కేటుగాళ్లు యువతను, సామాజిక మార్పును కోరుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం చేరండి’, ‘అవినీతిపై గళమెత్తండి’ అనే ఆకర్షణీయమైన నినాదాలతో వాట్సాప్, సోషల్ మీడియాలో నకిలీ లింకులను పంపుతున్నారు. ఈ సందేశాలతో పాటు వచ్చే ఫిషింగ్ లింక్ను క్లిక్ చేయగానే, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దొంగిలించడమే కాకుండా మొబైల్లో హానికరమైన మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని ఉత్తరప్రదేశ్ పోలీస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారు రాహుల్ మిశ్రా పేర్కొన్నారు.
లింక్ నొక్కితే జరిగే నష్టం ఏంటి?
సాధారణంగా కేవలం లింక్ను క్లిక్ చేయడంతోనే నేరుగా డబ్బులు కట్ కావు. కానీ, ఆ లింక్ ఓపెన్ చేయగానే వచ్చే నకిలీ వెబ్సైట్లలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు, లేదా యూపీఐ పిన్ నమోదు చేయమని అడుగుతారు. ఆ వివరాలను పూరించిన వెంటనే క్షణాల్లో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయల్లొ ఆసక్తి ఉన్నవారు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయి. ఏదైనా అధికారిక సంస్థ పేరుతో వచ్చే సందేశాల యూఆర్ఎల్, డొమైన్ స్పెల్లింగులను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ నకిలీ లింకులను గుర్తించవచ్చు.
పొరపాటున క్లిక్ చేస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీరు పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేసి, మీ బ్యాంకింగ్ వివరాలను పంచుకుంటే అస్సలు ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్ హెల్ప్లైన్కు కాల్ చేసి డెబిట్/క్రెడిట్ కార్డులను, యూపీఐ సేవలను బ్లాక్ చేయించుకోవాలి. మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను వెంటనే మార్చాలి. ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా తక్షణమే జాతీయ సైబర్ హెల్ప్లైన్ నంబర్ ‘1930’ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలి.
ఇది కూడా చదవండి: 50 శాతం మార్జిన్తో ‘బొద్దింక’ వ్యాపారం!


