అశ్రుతర్పణం | Bengaluru Techie DIes in Kashmir Terror Attack | Sakshi
Sakshi News home page

అశ్రుతర్పణం

Apr 25 2025 8:54 AM | Updated on Apr 25 2025 8:54 AM

Bengaluru Techie DIes in Kashmir Terror Attack

కాశ్మీర్‌లో బలైన ఇద్దరు కన్నడిగుల మృతదేహా తరలింపు  

బెంగళూరు, శివమొగ్గలో శోకసంద్రం  

గవర్నర్, సీఎం సహా ప్రముఖుల నివాళులు  

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు   

పాక్‌ ముష్కరుల అకృత్యంపై జనాగ్రహం

శివమొగ్గ(కర్ణాటక): జమ్ముకాశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్‌ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు.  

శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి   పార్థివ దేహాన్ని అంబులెన్స్‌ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్‌ సమీపం నుంచి బైక్‌ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. 

అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు  బైక్‌ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు.  

భరత్‌ భూషణ్‌ ఇంటికి గవర్నర్, సీఎం  
కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్‌ భూషణ్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్‌ భూషణ్‌ ఇంటికి ఉదయం గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాశ్మీర్ టూర్‌ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పారీ్టల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్‌ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement