రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! | Banshi Narayan Mandir In Uttarakhand Opens Only On Raksha Bandhan - Sakshi
Sakshi News home page

రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!

Published Thu, Aug 24 2023 9:58 AM

Banshi Narayan Mandir Uttarakhand Opens only on Raksha Bandhan - Sakshi

భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ లక్షల దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని పలు ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. 

కొన్ని దేవాలయాలు దూరప్రాంతాలలో నెలకొనివుంటాయి. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు. 

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బన్షీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం  నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. 

ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున  స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? 

Advertisement
Advertisement