అసోం మెడికల్‌ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు | Assam college cancels advisory avoid being alone after uproar | Sakshi
Sakshi News home page

అసోం మెడికల్‌ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు

Aug 14 2024 2:48 PM | Updated on Aug 14 2024 2:52 PM

Assam college cancels advisory avoid being alone after uproar

గువాహటి: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్‌ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీ(సూచనలు)పై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అయ్యారు. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఆస్పత్రి విడుదల చేసిన   అడ్వైజరీలో.. ‘మహిళా డాక్టర్లు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు తక్కువగా, జనాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. అత్యంత అవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో హాస్టల్స్ విడిచి బయటకు వెళ్లవద్దు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అధికారులకు సమాచారం అందించాలి. అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. ఏదైనా వేధింపుల సమస్య  ఎదురైతే.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం  అందించండి’’ అని పేర్కొంది. ఈ  అడ్వైజరీని డాక్టర్లు, విద్యార్థులు తీవ్రగా వ్యతిరేకించారు. అడ్వైజరీలో వాడిన పదజాలం  తమను బాధించిదని కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.

తమను రూంలకే పరిమితం కావాలని చెప్పే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చాలని డిమాండ్‌ చేశారు. క్యాంపస్‌లో లైటింగ్‌తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తమను బాధించిన అడ్వైజరీని సైతం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. మొదట ఆస్పత్రిలో మహిళా సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపినా.. విద్యార్థుల విమర్శల ఒత్తిడితో  వెనక్కి తీసుకున్నట్లు  సిల్చార్‌ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్ ప్రకటించింది. మరోవైపు.. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ).. దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు, హాస్టల్స్‌లో ఉండేవారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాలలకు అడ్వయిజరీ జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement